డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆసక్తికర అంశం మన ముందుకు తెచ్చాడు.  పూరి మ్యూజింగ్స్ పేరుతో పలు అంశాలపై తన అభిప్రాయాలను బయటపెడుతున్న ఆయన.. తాజాగా పర్ఫెక్ట్ హస్బెండ్ పేరుతో ఓ ఆడియో రిలీజ్ చేసి సంచలనం సృష్టిచారు. మొగుడు- పెళ్ళాం,  వాళ్ళ సంబంధంపై తనదైన స్టైల్‌లో కామెంట్స్ చేశారు . ఇది పెళ్లైన వారికి మాత్రమే అన్నట్లుగా బోల్డ్‌గా చెప్పేశారు. జీవితం సుఖమయం కావాలంటే ప్రతి ఆడది ఏం చేయాలనే దానిపై రియాక్ట్ అయ్యారు. ''పెళ్లైన ఆడవాళ్లందరికీ ఓ విన్నపం. జీవితంలో ప‌ర్‌ఫెక్ట్ తండ్రి, ప‌ర్‌ఫెక్ట్ త‌ల్లి, ప‌ర్‌ఫెక్ట్ డ్రైవ‌ర్, ప‌ర్‌ఫెక్ట్ నర్సు ఉండొచ్చేమో కాని ప‌ర్‌ఫెక్ట్ హస్బెండ్ మాత్రం ఎక్కడా ఉండడు. నా మొగుడికి ఇలాంటి క్వాలిటీసే ఉండాలి.. నా మొగుడు ఇలాగే ఉండాలి అని ఎంత పెద్ద లిస్ట్ రాసుకుంటారో అంత రిస్క్‌లో పడిపోతారు.


మొగుడిని అంచ‌నా వేయడం కష్టం. అందుకే పెళ్లైన ప్రతి ఆడది ఏదోఒక సమయంలో కన్నీళ్లు పెట్టాల్సిందే. లైఫ్‌లో మిమ్మ‌ల్ని చాలా మంది చాలా సార్లు ఏడిపిస్తారు. కానీ ఎక్కువ‌గా ఏడిపించేది ఒక్క మొగుడు మాత్ర‌మే. ఎందుకంటే జీవితంతం ఉంటాడు, ప‌క్క‌లోనే ఉంటాడు. చెప్పకుండా కొన్ని చేస్తాడు. చెప్పి కొన్ని చేస్తాడు, సీక్రెట్‌గా ఇంకొన్ని చేస్తాడు. అందుకే మీకు కాలుద్ది. త‌ప్పు లేదు.. అయితే ఇవే త‌ప్పులు మీ నాన్న కూడా చేస్తాడు. మీ నాన్న కారణంగా మీ అమ్మ ఎన్నిసార్లు ఏడ్చిందో గుర్తు తెచ్చుకోండి. ఏ మీరు మీ నాన్న‌ను క్ష‌మించ‌లేదా? ఆయన్ను క్ష‌మించిన‌ట్టే మొగుడిని కూడా క్ష‌మించి వదిలేయండి.మీ కంట్లో కన్నీళ్లు చూడకపోతే పక్కింటి వదిన గారికి అస్సలు నచ్చదు. ఆవిడ చెప్పే మాటలు విని అన‌వ‌స‌రంగా మొగుడితో గొడ‌వ ప‌డొద్దు. పోనీ ఆమె మొగుడేమ‌న్నా శ్రీరామ చంద్రుడా? కాదే!. అందరి పెళ్ళాల కంటే ఎక్కువ ఏడ్చింది రాముడి పెళ్ళామే. మొగుడు ఎంత గొప్పోడు అయితే భార్యకు అన్ని కన్నీళ్లొస్తాయి.


ప్రతి దేవుడు వాళ్ళ భార్యలను ఏడిపించినవాళ్ళే. పెళ్ళాం కంటతడి పెట్టించని ఒక్క దేవుడి పేరు చెప్పండి చూద్దాం.అందుకే మీరు సుఖంగా ఉన్నట్లు దయచేసి ఏ పిన్ని గారికి చెప్పొద్దు. కనిపంచినప్పుడల్లా కష్టాలు చెప్పండి. అమ్మయ్య.. దీని జీవితం కూడా నాలాగే సంకనాకి పోతోందంటూ హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఇక తప్పులు చేసే మొగుణ్ణి మీ అన్న‌య్య‌, త‌మ్ముడు, నాన్న‌నో అనుకొని వ‌దిలేయండి. జీవితంలో ఆ మాత్రం ఏడుపులు మొగుడు లేకపోయినా ఉంటాయి. ఇక్క‌డ ప‌ర్‌ఫెక్ట్ భ‌ర్త కాని ప‌ర్‌ఫెక్ట్ భార్య కాని ఎవ్వరూ ఉండ‌రు. పెళ్లంటేనే అడ్జెస్ట్‌మెంట్ ఆఫ్ ఇండియా.. అంతే'' అని చెప్పారు పూరి జగన్నాథ్.

మరింత సమాచారం తెలుసుకోండి: