దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న వేళ.. అన్ లాక్ సడలింపులు అన్నిరంగాలకు హుషారునిస్తున్నాయి. సినిమా రంగం కూడా అన్ లాక్ మార్గదర్శకాలతో మళ్లీ గాడిలో పడినట్టు కనిపించింది. ఓవైపు షూటింగ్ లు జరుగుతుండగానే, మరోవైపు థియేటర్లు కూడా తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తెలుగు సినిమా షూటింగ్ లపై మరోసారి కరోనా దెబ్బపడింది.

కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రారంభమైన సినిమాల్లో టక్ జగదీష్ ఒకటి. నాని హీరోగా సాహు గారపాటి నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అయితే అనుకోకుండా ఈ సినిమా షూట్ ఇప్పుడు మళ్లీ ఆగిపోయింది. యూనిట్ లో కీలకమైన టెక్నీషియన్లిద్దరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో సినిమా షూట్ ఆగిపోయినట్టు తెలుస్తోంది.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, శానిటైజేషన్ వంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కూడా ఈ పరిస్థితి తప్పలేదు. ముందుగానే యూనిట్ సభ్యులందరికీ కొవిడ్ పరీక్షలు చేయించి మరీ సెట్ లోకి అనుమతించారు. అయితే అనుకోకుండా టెక్నీషియన్లకు కొవిడ్ పాజిటివ్ గా తేలడంతో.. షూటింగ్ కి వచ్చిన అందరూ క్వారంటైన్ కి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.

గతంలో మెగాస్టార్ అల్లుడు సినిమా షూటింగ్ కూడా కొన్నాళ్లు ఇలానే వాయిదా పడింది. ఆ తర్వాత కొన్నాళ్లు మిగతా హీరోలు సెట్స్ పైకి వెళ్లేందుకు ధైర్యం చేయలేదు. అయితే ఇటీవల కేసులు తగ్గుతున్నాయనే కారణంతో సీనియర్ హీరోలు మినహా మిగతావారంతా ధైర్యంగా సెట్ లోకి అడుగుపెట్టారు. రవితేజ క్రాక్ షూటింగ్ లో పాల్గొంటున్నారు, ఓ పాట కూడా పూర్తి చేశారు. అలాగే హీరో నాని కూడా టక్ జగదీష్ ని లైన్లో పెట్టాడు. అనుకోకుండా టెక్నీషియన్లకు కరోనా సోకడంతో ఈ షూటింగ్ కాస్తా ఆగిపోయింది. దీంతో మిగతా హీరోలకు కూడా టెన్షన్ పట్టుకుంది. సెట్ లో మరింత జాగ్రత్తగా ఉండాలని వారు డైరక్షన్ డిపార్ట్ మెంట్ కి చెబుతున్నారట. షూటింగ్ కి రెడీ అవుతున్న ఒకరిద్దరు హీరోలు.. ఈ విషయం తెలిశాక మరికొన్ని రోజులు వేచి చూద్దామని డిసైడ్ అయ్యారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: