హీరో రాజశేఖర్ మార్కెట్ గురించి అంతగా పట్టించుకోకుండా ‘గరుడవేగ’ను భారీ బడ్జెట్లో తీశారు ప్రవీణ్. ఆ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. ఓవర్ బడ్జెట్ వల్ల కాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచింది ఆ సినిమా. అప్పుడు రామ్ తో అతను చేయాలనుకున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు సైతం బడ్జెట్ లెక్కలు భారీగా ఉండటంతో ఇది ఇక వర్కవుట్ కాదేమోనని రవికిషోర్ పక్కన పెట్టేశారని మీడియాలో గుసగుసలు వినిపించాయి. తరువాత ప్రవీణ్ ఇంకో రెండేళ్లు ఏ సినిమా చేయకుండా ఖాళీగానే ఉన్నారు.
పుల్లెల గోపీచంద్ బయోపిక్ తీయ్యాలని అనుకున్నారు కానీ.. అది ఎంతకీ కుదరక వదిలేసారు. మొన్న ఆమధ్య అక్కినేని నాగార్జున గారు హీరోగా ప్రవీణ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు అని అనౌన్స్ చేశారు. కానీ, అది ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందో ఇంకా తెలియదు. ఇది ఇలా ఉండగా రామ్, ప్రవీణ్ కాంబినేషన్ లో ఇదివరకే సెట్ అయిన ప్రాజెక్టును ఇప్పుడు మళ్లీ బయటికి తీసే ప్రయత్నం జరుగుతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. ప్రవీణ్ సినిమా ఆపేశాక రామ్ చేసిన ‘హలో గురూ ప్రేమ కోసమే’ మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది.
గత ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్’తో రామ్ బ్లాక్బస్టర్ విజయం అందుకున్నారు. ఈ సినిమాతో రామ్ మార్కెట్ భారీగా పెరిగింది. దీని తర్వాత చేసిన ‘రెడ్’ మూవీ మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దానికి మంచి రెస్పాన్స్ వచ్చి, బిజినెస్ కూడా జరిగింది. దీంతో స్రవంతి రవికిషోర్కు రామ్-ప్రవీణ్ సినిమా మీద భారీ బడ్జెట్ పెట్టడానికి ధైర్యం రావటంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రామ్, ప్రవీణ్ డేట్స్ చూసుకుని త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించాలని రవికిషోర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.