ఇక రెండేళ్ల క్రితం దిగ్గజ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మహానటి ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం తో పాటు అందులో తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ కు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ప్రస్తుతం పలు తమిళ సినిమాల్లో నటిస్తోన్న కీర్తి, తెలుగులో నితిన్ సరసన రంగ్ దే తో పాటు, అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. నిన్న కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ, సర్కారు వారి పాట యూనిట్ ఆమె పేరుని ఖరారు చేస్తూ ప్రకటించింది. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అమెరికాలో ప్రారంభం కానుండగా, దీనిని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఇకపోతే ఈ సినిమా తరువాత మరొక్కసారి పవర్ స్టార్ సరసన కూడా కీర్తి సురేష్ ఒక సినిమాలో నటించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ మూవీ చేస్తోన్న పవన్ కళ్యాణ్, దాని తరువాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి ల దర్శకత్వంలో కూడా సినిమాలు చేయనున్నారు. కాగా అతి త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయనున్న సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపిక అయింది అనేది ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్త యొక్క సారాంశం. ఇప్పటికే అజ్ఞాతవాసిలో పవన్ కు జోడీ కట్టి అపజయాన్ని మూటగట్టుకున్న కీర్తి, ఈసారి ఆయన సరసన నటిస్తున్న ఈ సినిమా ద్వారా విజయాన్ని సొంతం చేసుకుంటాను అంటోందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి ఆ మూవీ యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ....!!