‘‘అమ్మా.. నేను గడిచిన కాలానికి వెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు కరోనా లేదు.. వరదల్లేవు.. అవన్నీ నాకు ఎంతో సంతోషాన్ని అందించిన రోజులు’ అని నా తొమ్మిదేళ్ల కొడుకు నాకు చెప్పాడు. ఆ మాటలు నాకెంతో బాధగా అనిపించాయి. కన్నీరు పెట్టుకున్నాను. మనం ఎలాంటి పరిస్థితులు కొనితెచ్చుకున్నాం? రాబోయే తరాల వారికి మనం ఏం అందిస్తున్నాం?’ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు అనసూయ.
కరోనా వైరస్, పలు ప్రకృతి విపత్తులతో ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో కఠిన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ప్రతిఒక్కరూ గడిచిన సంవత్సరాలు గుర్తుచేసుకుంటూ ఆనాటి రోజులు తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనసూయ కుమారుడు కూడా గడిచిన సంవత్సరాలు ఎంతో మధురంగా ఉన్నాయని.. అవకాశం వస్తే ఆ కాలానికి వెళ్తానని చెప్పాడట. తనయుడి మాటలతో అనసూయ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ట్వీట్ చేశారు.
అనసూయ, భరద్వాజ్ దంపతులకు అయాన్ష్, శౌర్య అనే ఇద్దరు పిల్లలున్నారు. తనన కుటుంబానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను తరచూ అనసూయ సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. ఇటీవల లాక్డౌన్ సమయంలో సైతం షూటింగ్స్ నుంచి విరామం దొరకడంతో ఆమె.. తన ఇద్దరు కుమారులతో సరదాగా గడిపారు. తాజాగా తన కొడుకు అడిగిన ప్రశ్నను, దాని వల్ల తనకు కలిగిన బాధను కూడా అనసూయ అభిమానులతో షేర్ చేసుకున్నారు. అనసూయ ప్రకృతి ప్రేమికురాలు కూడా. ఆమె పక్షుల్ని కూడా పెంచుతుంటారు. పర్యావరణం పట్ల మనం బాధ్యతగా మెలగాలని సూచిస్తుంటారు. లాక్ డౌన్ టైమ్ లో పేదలకు సాయం చేసిన అనసూయ, ప్లాస్మా దానంపై పోలీసులతో కలసి ప్రచారం కూడా చేపట్టారు.