సంక్రాంతి పండుగ వస్తుందంటేనే అనేక భారీ సినిమాలు వరుసగా క్యూ కడతాయి. ఈ ఏడాది అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి బడా హీరోల సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై కోట్లను కొల్లగొట్టాయి. కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే కరోనా వైరస్ తో పాటు వరదలు కూడా బీభత్సంగా పోటెత్తుతున్నాయి. దీంతో సినిమా చిత్రీకరణలు మరింత ఆలస్యమవుతున్నాయి. సంక్రాంతి పండుగ లోపు సినిమా చిత్రీకరణలన్ని పూర్తి కావచ్చు కానీ కరోనా తగ్గుముఖం పడుతుందా లేదా అనేది తెలియడం లేదు. సాధారణంగా మహమ్మారి వైరస్ లు రెండుసార్లు విజృంభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ చలి కాలంలో కరోనా వైరస్ మళ్ళీ విజృంభించబోతుందా అన్న అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి.


ఇదిలా ఉండగా ఇప్పటివరకు కొన్ని చిత్రాల షూటింగు పూర్తి కాగా మరికొన్ని సినిమాల షూటింగ్ లు తుది దశలో ఉన్నాయి. దగ్గుబాటి రానా నటిస్తున్న అరణ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని చిత్ర బృందం ముహూర్తం ఖరారు చేసింది. సాయిధరమ్ తేజ నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా సెన్సార్ బోర్డ్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్టు వినికిడి. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది.


ఐతే పవన్ కళ్యాణ్ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ నవంబర్ మూడో వారం లోపు పూర్తి చేస్తారని విశ్వసనీయ సమాచారం. చిరంజీవి మాత్రం తన ఆచార్య సినిమాను ఇప్పట్లో పూర్తిచేయాలని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూసుకుంటే సాయి ధరమ్ తేజ్, దగ్గుబాటి రానా సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అప్పటి పరిస్థితులను బట్టి మరికొన్ని సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: