టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గత ఏడాది మన్మధుడు 2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలం అయింది. యువ దర్శకడు రాహుల్ రవీంద్రన్ తీసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇటీవల నాగార్జున తన తదుపరి సినిమా వైల్డ్ డాగ్ చేయడానికి సిద్దమయ్యారు. లాక్ డౌన్ కు ముందు ఈ సినిమా కొంతమేర షూటింగ్ ని జరుపుకుంది.
ఇకపోతే ఓవైపు సినిమాలు చేస్తూ పోతున్న నాగార్జున మరోవైపు గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా వ్యవహరించి షో ని మంచి సక్సెస్ చేసారు. అలానే ప్రస్తుతం ప్రసారం అవుతున్న సీజన్ 4 కి కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరువారాలకి పైగా పూర్తి చేసుకున్న ఈ షో ఏడవ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ కి నాగార్జున రావడం లేదని, ఆయన స్థానంలో అక్కినేని కోడలు సమంత అక్కినేని రానున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే ఈ విషయమై రెండు రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు కూడా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే అది నిజమేనా కాదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఇక కొద్దిసేపటి క్రితం తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ లో నాగార్జున ఒక వీడియో పోస్ట్ చేసారు. హిమాలయాల్లో తన లేటెస్ట్ సినిమా వైల్డ్ డాగ్ షూటింగ్ జరుగుతోందని, దాదాపుగా ఏడు నెలల తరువాత షూటింగ్ పునఃప్రారంభం అవడం ఆనందంగా ఉందని, అలానే ఈ షూటింగ్ మరొక 21 రోజుల పాటు జరుగుతుందని వీడియో లో నాగార్జున చెప్పారు. అయితే ఇదే ఇప్పుడు బిగ్ బాస్ లో నాగార్జున స్థానంలో సమంత రానున్నారు అనే వార్తలకు బలాన్ని చేకూర్చింది. వైల్డ్ డాగ్ షూటింగ్ కారణంగానే నాగార్జున బిగ్ బాస్ కు ఈ వారం హాజరు కావడం లేదని, ఆయన స్థానంలో అందుకే సమంత రానున్నారని అని కొందరు అంటున్నారు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలకు సంబంధించి పూర్తి వాస్తవాలు బిగ్ బాస్ యూనిట్ నుండి వెల్లడి కావలసి ఉంది....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: