కరోనా భూతం ప్రపంచాన్నే వణికించేస్తోంది. భారత్ లో కూడా పంజా విసిరింది. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీల వరకూ చాలామంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులెందరో ఈ వైరస్ బారిన పడ్డారు. టాలీవుడ్ లో కరోనా సోకిన వారిలో హీరో రాజశేఖర్ కుటుంబం ఉంది. ఇటివలే రాజశేఖర్, భార్య జీవిత వైరస్ బారిన పడ్డారు. వీరంతా బంజారా హిల్స్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
‘కరోనాతో బాధపడుతున్న రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. చికిత్సకు స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. రాజశేఖర్ సతీమణి జీవిత కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ పరిక్షల్లో నెగటివ్ రావడంతో ఆమెను డిశ్చార్జి చేశాం’ అని తెలిపారు. ఇదే విషయమై రాజశేఖర్ కుమార్తె కూడా వివరాలు తెలియజేశారు. ‘నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో వైద్యుల బృందం నాన్నను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నాన్న ఆరోగ్యం కోసం మీరు చేస్తున్న ప్రార్ధనలకు ధన్యవాదాలు’ అంటూ సోషల్ మీడియాలో వెల్లడించింది.

ఇటివలే రాజశేఖర్ ఆరోగ్యంపై శివానీ చేసిన పోస్ట్ కలకలం రేపింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తోంది. రాజశేఖర్ కుమార్తెలకు పెద్దగా కరోనా లక్షణాలు కనిపించ లేవని తెలుస్తోంది. వారు త్వరగానే కోలుకున్నారు. ప్రస్తుతం జీవిత కూడా ఆరోగ్యంగా ఉన్నారు. రాజశేఖర్ కోలుకుంటున్నారని.. దయచేసి అసత్య వార్తలు ప్రసారం చేయొద్దని జీవిత అన్నారు. ఇటివల మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు కూడా రాజశేఖర్ ఆరోగ్యంపై స్పందించారు. రాజశేఖర్, జీవిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: