టాలీవుడ్ సినీ వర్గాల్లో ఒక వార్త రీసెంట్ గా చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే శతాధిక చిత్రాల దర్శకుడు, టాలీవుడ్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు సరికొత్త ప్రయోగం చేయబోతున్నారని తెలుస్తోంది. 78 ఏళ్ల వ‌య‌సున్న ఆయన ఇన్నాళ్లకు కెమెరా ముందుకు రాబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అది కూడా హీరోగా అని తెలుస్తుండటంతో టాలీవుడ్ లోకమంతా ఈయన గురించే చర్చించుకుంటున్నారు. ఇన్నేళ్లు ఎన్నో కథలకు తనదైన శైలిలో రూపమిచ్చి భారీ హిట్స్ అందుకున్న ఈ గ్రేట్ డైరెక్టర్.. రిటైర్మెంట్ వయస్సులో హీరోగా ఎంట్రీ ఇవ్వడమేంటని ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. ఎంతైనా సినీ ఇండస్ట్రీ కదా! ఇక్కడ ప్రయోగాలకే పెద్ద పీట వేస్తారు. అందుకేనేమో ఈ వయస్సులో కొత్త ప్రయోగం చేయాలని అనుకుంటున్నారు రాఘవేంద్ర రావు. 1975 సంవత్సరం 'బాబు' సినిమాతో మెగా ఫోన్ పట్టి కెరీర్ ప్రారంభించిన ఆయన ఇంతవరకూ కెమెరా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు.. అది కూడా కెరీర్ చివరి రోజుల్లో ఇలా ఆయన ఆరంగేట్రం చేయడం తెలుగు ప్రేక్షకుల్లో ఒకింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇటీవల ఓ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ‌కు ఫిదా అయిన దర్శకేంద్రుడు ఏకంగా ఆ కథతో తానే హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారట. పైగా కథ ప్రకారంగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కి స్కోప్ ఉందని తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఇందుకోసమై రమ్యకృష్ణ, శ్రీయ, త్రిషలతో ఇప్పటికే సంప్రదింపుల కార్యక్రమాలు కూడా ఫినిష్ అయ్యాయని తెలుస్తోంది. ఈ విషయాలు నెట్టింట వైరల్ అవుతుండటంతో రాఘవేంద్ర రావుకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారట ఆయన సన్నిహితులు. మొత్తానికైతే దర్శకేంద్రుడు చేయబోయే ఈ ప్రయోగం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. రానున్న మరికొద్ది రోజుల్లో ఈ సినిమా వార్తలపై స్పష్టమైన సంకేతాలు రానున్నాయి. చూడాలి ఈ వార్త నిజంగానే కార్యరూపం దాల్చనుందా లేేక గాలి వార్తగానే మిగిలిపోనుందా... 

మరింత సమాచారం తెలుసుకోండి: