సోషల్ మీడియా విస్తృతమయ్యాక పరిచయాలు కూడా పెరిగాయి. ఎవరో, ఏంటో కూడా తెలీకుండా మెసేజెస్ ద్వారా మాటలు కలిసిపోతున్నాయి. అదే స్నేహం అని నమ్మేస్తున్నారు. ఈ ముసుగులో ఎన్నో దారుణాలు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆర్ధిక నేరాలతోపాటు, మోసాలు, అమ్మాయిలపై వేధింపులు.. ఇలా మోసాలకు అడ్డాగా కూడా మారుతోంది సోషల్ మీడియా. ఈ క్రమంలోనే సోషల్ మీడియా పరిచయం ఓ నటి ప్రాణం మీదకు తెచ్చింది. స్నేహం ముసుగులో ఆమెపై విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ప్రస్తుతం ఆ నటి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ముంబైలో మాల్వి మల్హోత్రా అనే టీవీ నటి కత్తి పోట్లకు గురైంది. యోగేశ్ కుమార్ మహిపాల్ సింగ్ అనే వ్యక్తి సోమవారం రాత్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఓ కేఫ్ నుంచి మాల్వి బయటకు వస్తూండగా నిందితుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు. యోగేశ్ కుమార్ తాను ఓ నిర్మాతగా మాల్వికి సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. పరిచయం స్నేహంగా మారింది. కానీ.. మాల్వీ వద్ద యోగేశ్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇందుకు మాల్వీ తిరస్కరించింది. సోషల్ మీడియాలో యోగేశ్ ను బ్లాక్ చేసింది. అతనితో మాట్లాడటం కూడా మానేసింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు యోగేశ్.

సోమవారం రాత్రి ఓ లగ్జరీ కారులో వచ్చి మాల్వీని అడ్డగించాడు. నీతో మాట్లాడటం ఇష్టం లేదని యోగేశ్ తో తేల్చి చెప్పింది. దీంతో తనతో తెచ్చుకున్న కత్తితో మాన్వీ ఛాతీ కింది భాగంలో మూడు సార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు వెర్సోవా పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: