తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణకి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తరువాత వచ్చిన ఆయన వారసులు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణ తనయునిగా మొదట ఆయన పెద్ద కుమారుడు రమేష్ సినీ రంగ ప్రవేశం చేసి, పెద్దగా రాణించలేకపోయాడు. ఆ తర్వాత చిన్ననాటి నుండి బాలనటునిగా చేస్తూ వస్తున్న మహేష్ బాబు ఆయనకు మరో వారసునిగా పరిచయమై సంచలనాలు సృష్టిస్తూ తండ్రికి తగ్గ తనయునిగా, నేటితరం సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకొని టాలీవుడ్ లో స్టార్ గా వెలిగిపోతున్నాడు. కృష్ణ కుమార్తె మంజుల కూడా కొన్ని చిత్రాలలో నటించి మెప్పించి, ఆ తర్వాత నటనను పక్కనపెట్టింది. ఇక సుధీర్ బాబు కూడా ఆ ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫర్వాలేదనిపించుకుంటున్నాడు. తాజాగా మరో వారసుడు సినీ ప్రవేశం చేయనున్నారు.

సూపర్‌స్టార్‌ కృష్ణ - విజయనిర్మల కుటుంబం నుంచి మరో వారసుడు సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. వీరి మనవడు శరణ్‌ ‘దిలైట్‌'కుమార్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న నూతన చిత్రం విజయదశమి పర్వదినాన ప్రారంభమైంది. మాన్విత, కుశలకుమార్‌ బులేమని సమర్పణలో సినీటేరియా మీడియా వర్క్స్‌ పతాకంపై రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో శ్రీలత బి.వెంకట్‌, వెంకట్‌ బులేమని నిర్మిస్తున్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం హీరో శరణ్‌, నటుడు జెమిని సురేష్‌లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి హీరోలు సుధీర్‌బాబు, విజయకృష్ణ నవీన్‌ కెమెరా స్విఛాన్‌ చేయగా, నటుడు వీకే నరేష్‌ క్లాప్‌ ఇచ్చారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్‌ నటుడు కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ‘మా కుటుంబం నుంచి వచ్చిన అందరి హీరోలను ప్రేక్షకులు ఆదరించారు. శరణ్‌ కూడా ప్రేక్షకుల అభినందనలు అందుకుంటాడనే నమ్మకం వుంది’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: డాక్టర్‌ చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: సురేష్‌ గంగుల, ఛాయాగ్రహణం: భరద్వాజ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: