ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. కరోనా నేపథ్యంలో దాదాపు 10 నెలలు గడుస్తున్నా తన నెక్ట్స్ ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోయారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు దర్శకుడు త్రివిక్రమ్. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో బిజీగా ఉండటంతో ఈ సినిమా సెట్స్ పైకి రాలేదు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర చిత్రీకరణ పూర్తి చేయడానికి చాలా టైం పట్టనుంది. దీంతో త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా తీయనున్నట్లు సమాచారం వచ్చింది.
అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ప్రస్తుతం మహేశ్ ‘సర్కారి వారి పాట’ సినిమాలో షూటింగ్ బిజీలో ఉండటంతో ఈ సినిమా సెట్స్ పైకి ఇప్పుడే రాకపోవచ్చు. ఈ క్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ హీరో రామ్ కు సినిమా స్టోరీని కూడా చెప్పాడని, రామ్ ఓకే కూడా చెప్పాడని సమాచారం.
త్వరలో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ‘రెడ్’ సినిమా పూర్తి చేసిన రామ్.. ఇప్పటివరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి వివరాలు వెల్లడించలేదు. త్రివిక్రమ్ రామ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పట్లో త్రివిక్రమ్ చిన్న హీరోలతో సినిమా చేసే అవకాశం లేకపోవచ్చని భావిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా.. రాదా.. అనేది వేచి చూడాల్సిందే.