సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు అనే ఇమేజ్ తో కాకుండా తనకు తానుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చూస్తున్నారు హీరో సుధీర్ బాబు. అందుకే ఒంటరిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అడపాదడపా ఆయన సినిమా ప్రమోషన్లకు కృష్ణ ఫ్యామిలీ అటెండ్ అవుతుంది కానీ, సినిమాల మేకింగ్ విషయంలో ఎవరి జోక్యాన్ని సుధీర్ బాబు కోరుకోవడంలేదు. అయితే తొలిసారిగా మహేష్ బాబు తన బావ సుధీర్ బాబుకోసం ఓ సినిమా సెట్ చేశారు. అదే శ్రీదేవి సోడా సెంటర్.

గతంలో సుధీర్ బాబుతో భలే మంచి రోజు సినిమా నిర్మించిన 70ఎం.ఎం. ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమాని కూడా నిర్మిస్తోంది. పలాస సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన కరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా ఈ ముగ్గురినీ కలిపే బాధ్యత మహేష్ బాబు తీసుకున్నారట. పలాస అనే సినిమాతో కరుణ్ కుమార్ కాస్త పరవాలేదనిపించుకున్నారు. మాస్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా సినిమా చేశారు. ప్రస్తుతం సుధీర్ బాబు కూడా మాస్ హీరోగా నిలదొక్కుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే వి అనే మూవీతో మల్టీస్టారర్ కి కూడా ఒప్పుకున్నారు. అయితే అది కూడా ఆయనకు పెద్దగా ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో కొత్త సినిమాతో అయినా మాస్ హీరోగా ఎలివేట్ కావాలనుకుంటున్నారు సుధీర్ బాబు.

మాస్ టైటిల్ లో మాస్ సబ్జెక్ట్ తో వస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్నిస్తున్నారు. పలాసకు మంచి పాటలు ఇచ్చినా కూడా ఎందుకో సంగీత దర్శకుడు రఘు కుంచెను కరుణ కుమార్ పక్కనపెట్టారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని టాలీవుడ్ వర్గాలంటున్నాయి. వీలైతే సంక్రాంతి తర్వాత సినిమా విడుదల చేసేందుకు కూడా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతికి సినిమా థియేటర్లు, సినిమలా పరిస్థితి ఏంటనేది తెలుస్తుంది. ఆ తర్వాత విడుదలయ్యే సినిమాలకు ఆ బెనిఫిట్ ఉంటుందని దర్శకుడు, హీరో తొందరపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: