ఎంగేజ్ మెంట్ రింగ్ ఫొటోలు పెట్టి రెండు రోజుల క్రితం నెటిజన్లను ఆటపట్టించింది పునర్నవి. ‘ఎట్టకేలకు ఇది జరుగుతోంది’ అని అంటూ ఎంగేజ్ మెంట్ రింగ్ ఫొటోకి క్యాప్షన్ కూడా పెట్టేసింది. దీంతో చాలామంది అభిమానులు నిజంగానే పున్ను ఎంగేజ్ మెంట్ జరిగిపోయిందని అనుకున్నారు. బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ ని కాకుండా.. మరొకర్ని ఆమె వివాహం చేసుకుంటోందని నమ్మేశారు. చాలామంది పున్నుకి శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే ఇదంతా డ్రామా అని తేల్చేసింది పునర్నవి.
ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన సరికొత్త పోస్టుతో.. వెబ్సిరీస్ ప్రమోషన్లో భాగంగానే అలా టీజ్ చేసినట్లు చెప్పకనే చెప్పేశారు. పునర్నవి, రఘునందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్సిరీస్ ‘కమిట్మెంటల్’. త్వరలో ఆహా ప్లాట్ ఫామ్ లో ఈ వెబ్ సిరీస్ మొదలవుతుంది. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్కు సంబంధించిన పోస్టర్ను తాజాగా పునర్నవి అభిమానులతో పంచుకున్నారు.
ఇటీవలే హైదరాబాద్ వరదలపై సెటైర్ వేయబోయి ఇబ్బందుల్లో పడ్డారు నటుడు బ్రహ్మాజీ. అలాగే పునర్నవి కూడా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాన్ని చెబుతున్నట్టు అభిమానుల్ని టీజ్ చేసి చివరకు వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం అని తేల్చేసింది. దీంతో అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ప్రమోషన్ కోసం పర్సనల్ లైఫ్ పై జోకులేయొద్దని హితవు చెబుతున్నారు.