ఇదిలా ఉంటే కరోనా వేళ లాక్ డౌన్ విధించిన కేంద్రం ఆ తరువాత మెల్లగా అన్ లాక్ చేస్తూ వచ్చింది. అక్టోబర్ 15 నుంచి సినిమా హాళ్లను కూడా తెరచుకోవచ్చు అని అనుమతి ఇచ్చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ థియేటర్లు తెరవడంలేదు కానీ ఐమాక్సులు మాత్రం తెరిచారు. అయినా సరే అక్కడ సందడి లేదు. దానికి కారణం కొత్త సినిమాలు లేకపోవడం. రెండవది కరోనా భయం.
దాంతో ప్రతీ షోకు అత్యంత దారుణంగా నాలుగైదు టికెటు మాత్రమే తెగుతున్నాయట. మరి వారితో సినిమా ఆడించడం అంటే కోరి నష్టాలను తెచ్చుకోవడమే. ఇక సినిమా హాళ్ళను ఇలాగైతే రన్ చేయలేమని హైదరాబాద్ కి చెందిన ఐమాక్స్ థియేటర్ యాజమాన్యం ఒక బంపర్ ఆఫర్ ని ఆడియన్స్ కి ఇస్తోంది. ఏకంగా సినిమా హాలే ఒక షోకి మీకు ఇస్తాం. మీరు కట్టాల్సింది కేవలం 2,990 రూపాయలు మాత్రమేనని అంటోంది. నిజానికి లాక్ డౌన్ నిబంధనల మేరకు ఒక షోకు 50 శాతం మందిని ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలి.
మొత్తం ఐ మాక్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్ పడితే షోకు 7,500 వస్తుంది. దానిలో సగం కంటే కూడా తక్కువగా 2,900 రూపాయలే ఒక షోకి థియేటర్ ని ఇస్తాం, మీకు నచ్చిన సినిమా కూడా చూపిస్తామని అంటున్నారు. ఇదేదో అపార్ట్ మెంట్లలో ఉండే వారికి, కాలనీలలో ఉండేవారికి మంచి ఆఫరే. అంతా కలసి ఒక షోకి డబ్బు కట్టి థియేటర్ బుక్ చేసుకుంటే ఎంచక్కా వారే సినిమా చూడవచ్చు. అంతే కాదు, కరోనా భయాలు కూడా ఉండవు. మరోవైపు థియేటర్ కి కూడా బాగా ఫీడింగ్ దొరుకుతుంది. మరి ఈ ఆఫర్ కి ఎంతమంది ముందుకు వస్తారో చూడాలి.