ఈ ఏడాది  సంక్రాంతి  సమయంలో అలవైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. గీతాఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఎంతో భారీ ఖర్చుతో నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ జాతీయస్థాయిలో విపరీతమైన గుర్తింపు సంపాదించింది.

ఇక దీని అనంతరం అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పుష్ప. గతంలో అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య 2 సినిమాలు తెరకెక్కించిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని మంచి యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కు ముందు కొంతవరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది. ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే మాస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపద్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ని వీక్షించడానికి పలువురు అల్లు అర్జున్ అభిమానులు, ఇతర ప్రేక్షకులు సెట్ కు రావడం జరిగిందట.

అయితే అదే సమయంలో ఆయన పాత్ర యొక్క లుక్ ని, అలానే మూవీ సెట్ ని ఫోటోలు తీసి వాటిని పలు మీడియా మాధ్యమాల్లో వారి లోని కొందరు అప్లోడ్ చేయడం అది విపరీతంగా వైరల్ కావడం జరిగింది. దానితో  సినిమాకు సంబంధించి ఎటువంటి విషయాలు లీక్ కాకూడదని భావించిన పుష్ప యూనిట్  ఇకపై సెట్లోకి విజిటర్స్ కానీ అభిమానులు కానీ రావడానికి వీలు లేదని గట్టిగా ఆంక్షలు విధించినట్లు సమాచారం. అయితే ఇదంతా ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదని సినిమా విషయంలో ఏది బయటకు వచ్చినా అది రాబోయే రోజుల్లో సినిమాకు నష్టం చేస్తుందనే ఆలోచనతోనే మూవీ యూనిట్ ఈ విధంగా వ్యవహరించినట్లు సమాచారం. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: