పవర్స్టార్ ‘వకీల్సాబ్’ అంటూ థియేటర్స్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత పవన్ పూర్తి చేయాల్సిన సినిమాల లిస్టు చాలా పొడవే ఉంది. ఈ లిస్టులో గమ్యం, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి, కృష్ణం వందే జగద్గురుమ్, మహానాయకుడు, యన్టీఆర్ వంటి అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన డైరెక్టర్ రాధాకృష్ణ జాగర్లమూడి(క్రిష్) సినిమా కూడా ఒకటి.
కరోనా కారణంగా సినిమా షూటింగులకు అంతరాయం కలిగింది. లేదంటే ఇప్పటికే వకీల్ సాబ్ పూర్తి అవ్వాల్సింది. దీంతోపాటు క్రిష్ సినిమా కూడా ఈపాటికే షూటింగ్ పూర్తి చేసుకొని ఉండాల్సింది. కానీ ఏం చేద్దాం. కరోనా ప్రభావంతో సినిమా షూటింగులన్నీ మూలన పడ్డాయి. దీంతో ఈ చిత్రం షూటింగ్ కూడా ఆలస్యమైంది. ఈ సినిమాను పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది తేలిపోయిందట.
హిందీ కిక్ సినిమాతో కుర్రకారును ఆకర్షించిన శ్రీలంక బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్.. పవన్-క్రిష్ సినిమాలో నటిస్తోందనే టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు దీనిపై తాజా అప్డేట్ అంటూ మరో విషయం తెరపైకి వచ్చింది. జాక్వెలైన్ స్థానంలో ‘ఇస్మార్ట్’ బ్యూటీ నిధి అగర్వాల్ను హీరోయిన్గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇదే కనుక నిజమైతే నిధి అగర్వాల్ బంపరాఫర్ కొట్టేసినట్లే. తెలుగులో నిధి నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.