‘ఛత్రపతి’ శివాజీ కొలువులో సైన్యాధ్యక్షుడైన తానాజీ జీవిత గాధను కూడా బాలీవుడ్ దర్శకులు వెండితెరపై ఆవిష్కరించారు. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సీఫిస్ వద్ద భారీ విజయం దక్కించుకొంది. ఇప్పుడు శివాజీ కథనే సినిమా తీయాలని భావిస్తున్నారట. ఈ ఆలోచన వచ్చింది కూడా మరెవరికో కాదు.. ‘బాహుబలి’ సిరీస్తో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న దర్శక ధీరుడు రాజమౌళికే. మన జక్కన్నకు శివాజీ అంటే మొదటి నుంచీ ఇష్టమేనని గుసగుసలు వినపడుతున్నాయి.
గతంలో ప్రభాస్ హీరోగా ‘ఛత్రపతి’ తీసిన రాజమౌళి.. బ్లాక్ బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆ యోధుడి కథనే తెరకెక్కించాలని డిసైడయ్యారు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్కు తనకు ఎలాంటి కథ కావాలో కూడా రాజమౌళి చెప్పేశారట. ఆయన నెక్స్ట్ మూవీ ఇదేనని ప్రచారం జరుగుతోంది. అయితే మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఓ సినిమా చేయాల్సి ఉంది. దీంతో శివాజీ బయోపిక్లో మహేష్ బాబే హీరో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అటు రాజమౌళికానీ, ఇటు మహేష్ గానీ ఎటువంటి కామెంటూ చేయలేదు.
శివాజీ ఉత్తర భారతదేశంలో బాగా పాపులర్. అలాగే దక్షిణాదిలో కూడా పేరున్న యోధుడు. దీంతో బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాల తర్వాత రాజమౌళి ఇలాంటి కథనే ఎంచుకోవాలని, ఇది కరెక్ట్ డెసిషన్ అని కొందరు వాదిస్తున్నారు. కాగా, మహేష్-కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘భరత్ అనే నేను’ తర్వాత కూడా ఇలాంటి వార్తలే వినిపించాయి. మహేష్ తర్వాతి సినిమా రాజమౌళితోనే అని, అది కూడా ఛత్రపతి శివాజీ జీవిత గాధేనని గుసగుసలు వినిపించాయి.