కెసిఆర్ వరాలతో.. సినిమా ఇండస్ట్రీ ఊపిరిపీల్చుకుంది. థియేటర్స్ యాజమాన్యం వారి ఇష్టానుసారం సినిమా టిక్కెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతి కల్పిస్తామన్నారు సిఎం. అయితే ఈ పాయింట్ ఎగ్జిబిటర్లకు.. డిస్ట్రిబ్యూటర్స్.. నిర్మాతలకు లాభం చేకూర్చేదే అయినా.. సామాన్యులమీద భారం పడుతుంది. టిక్కెట్ రేట్లు ఇప్పటికే భారీగా వున్నాయి. మల్టీప్లెక్స్లో 150 నుంచి 250 రూపాయిలు.. సింగిల్ థియేటర్లో టిక్కెట్ రేటు 100 రూపాయిలు . కరోనా భయం పోగొట్టడానికి ముందు జనాలు థియేటర్లోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. టిక్కెట్ రేట్లు పెంచితే.. ఈ భయం మరింత పెరిగే అవకాశం వుంది.
గతంలో పెద్ద సినిమాలు పర్మిషన్ తెచ్చుకుని.. ఒకట్రెండు వారాలు టిక్కెట్ రేట్లు పెంచి అమ్మేవారు. సిఎం ఇచ్చిన అవకాశంతో.. ప్రస్తుతం ఓ మాదిరి క్రేజ్ వున్న సినిమాలు సైతం వారంలోనే పెట్టుబడి రాబట్టేయాలన్న వుద్దేశంలో టిక్కెట్ రేట్స్ను పెంచే అవకాశం వుంది. ఫ్యామిలీతో సినిమాకు వెళ్లాలంటే.. వెయ్యి అయిపోతుందని.. ఆలోచించే కుటుంబాలు చాలా వున్నాయి. ఈక్రమంలో పైరసీ పెరిగిపోయింది. కరోనా తర్వాత ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. ఈసమయంలో టిక్కెట్ రేట్లు పెంచితే.. పైరసీ మరింత చెలరేగే అవకాశం లేకపోలేదు. గత 8 నెలలుగా ఓటీటీలకు అలవాటుపడిన ప్రేక్షకులను థియేటర్స్ వైపు ఆకర్షించడానికి 50 పర్సెంట్ టిక్కెట్స్కే బాలీవుడ్ సినిమాలు చూపిస్తున్నారు. ప్రస్తుతం నెలకున్న సంక్షోభం నుంచి టాలీవుడ్ను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ ధరలు పెంచుకునే అకాశం కల్పించగా.. మరి ఎగ్జిబిటర్లు.. డిస్ట్రిబ్యూటర్స్ ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.