తెలుగు చిత్ర పరిశ్రమలో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది రిచాగంగోపాద్యాయ. తెలుగు చిత్ర పరిశ్రమకు దగ్గుబాటివారబ్బాయి రానా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘లీడర్’ సినిమాతో పరిచయమైంది రిచాగంగోపాద్యాయ. ఆ తర్వాత ఆమె రవితేజ నటించిన ‘మిరపకాయ్’ సినిమాలో తన అంద చందాలతో కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. అయితే ఈ అమ్మడు అనుకోకుండా సినిమాలకు దూరమై ఫ్యాన్స్ కు గట్టి షాక్ ఇచ్చింది.

ఇక ఈ ముద్దుగుమ్మ నటించింది తొమ్మిది సినిమాలే అయినా అమ్మడికి క్రేజ్ మాత్రం భారీగా ఉంది. ఈ బాబ్లీ బ్యూటీని మళ్ళీ తెరపై చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు. ఇదిలా ఉంటే తమిళ్ స్టార్ హీరో ధనుష్, రిచా కలిసి నటించిన ‘మయక్కం ఎన్నా’ సినిమా విడుదలై నేటికీ తొమ్మిది ఏళ్ళు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది ఈ భామ.

సోషల్ మీడియాలో వరుస పోస్టులు షేర్ చేస్తూ.. మయక్కం ఎన్నా’ సినిమా అప్పడే తొమ్మిది ఏళ్ళు పూర్తి చేసుకుందంటే నమ్మలేకపోతున్నాను. నా కలలను సాకారం చేసుకునేందుకే సినిమాలకు దూరం కావాల్సివచ్చింది. అందుకు నాకు ఎలాంటి బాధలేదు. నటిగా రాణిస్తున్న సమయంలోనే నాకు మార్కెటింగ్, మేనేజ్ మెంట్ లో ట్రైనింగ్ తీసుకోవాలని కోరిక కలిగింది. దాంతో  ఎంబీఏ చేసాను. ఆ సమయంలోనే  నా క్లాస్మేట్ తో పరిచయం ఏర్పడింది. అతడే నా జీవిత భాగస్వామి అయ్యాడు.

ఇక జీవితంలో ప్రతిసారి ఛాయిస్ లు ఉంటాయి. 24 ఏళ్ల వయసులో ఉన్నపుడు నాకున్న ఇష్టాలు నా కలలు అన్నీ ఇప్పుడు మారిపోయాయి. అయినా ఐ లవ్ మై లైఫ్ . సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ నా పై అభిమానం కురిపిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. సినిమాల్లో ఉన్నది కొంతకాలమే అయినా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాను’అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: