ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ దాని అనంతరం నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా తో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా దీనిని వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, జయరాం, భాగ్యశ్రీ, ప్రియదర్శి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా జస్టిన్ ప్రభాకరన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇక పోతే నేడు ప్రభాస్ నటించబోయే మరో సినిమాకు సంబంధించి కూడా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. కే జి ఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న సినిమా 'సలార్'. అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కనున్న ఈ సినిమాను హోంబలె ఫిల్మ్స్ సంస్థ నిర్మించనుంది. ఇప్పటికే బాహుబలి రెండు సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా విపరీతమైన పేరు ప్రఖ్యాతలు గడించిన ప్రభాస్ ఈ విధంగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు ఎంచుకుంటూ తన ఇమేజ్ ను మరింతగా పెంచే విధంగా ముందు కొనసాగుతున్నారు. ఇకపోతే ఇటీవల కొద్ది రోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అయిన వార్తల ప్రకారం కే జి ఎఫ్ చాప్టర్ 2 అనంతరం ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్నారు అనేటువంటి వార్తలు రావడం జరిగింది.

అయితే ఒక్కసారిగా ఆయన ప్రభాస్ తో సలార్ సినిమా అనౌన్స్ చేయడంతో ఎన్టీఆర్ తో అసలు సినిమా చేస్తారా లేదా అనే దానిపై నేటి ఉదయం నుండి కొంత ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కాగా వీటన్నిటికీ చెక్ పెడుతూ ఎన్టీఆర్ సన్నిహితులు కొందరు మాట్లాడుతూ అతి త్వరలో ప్రభాస్ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తో సినిమా చేయడం పక్కా అని అలాగే ఆ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుందని అంటున్నారట. అలానే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక న్యూస్ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో కూడా రానుందని వారు చెప్పినట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: