చిత్తూరు: తమిళ నాడు చుట్టు పక్కల ప్రాంతాల్లో సంప్రదాయంగా నిర్వహించే జల్లికట్టు వేడుకల్లో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మెరిశారు. అదేంటి? మన తారక్ జల్లికట్టుకు ఎప్పుడు వెళ్లారు? అని ఆశ్చర్య పోతున్నారా? ఆయన డైరెక్టుగా రాలేదులెండి. జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో ఆయన అభిమానులు జల్లికట్టు వేడుకల్లో తెగ సందడి చేశారు. పోట్లగిత్తల కొమ్ములకు ఎన్టీఆర్ ఫొటోలను తగిలించి ఆనందంతో మురిసి పోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం అనుప్పల్లిలో చోటు చేసుకుంది. జల్లికట్టు వేడుకలలో పాల్గొనే పోట్లిగిత్తలను అందంగా ముస్తాబు చేయడం ఆనవాయితీ.

అయితే ఈ సమయంలో కొన్ని పోట్ల గిత్తల కొమ్ములకు ఎన్టీఆర్ ఫొటోలను తగిలించిన ఫ్యాన్స్ వాటిని రంగంలోకి దింపారు. ఇలా వీళ్లు తమ అభిమానం చూపించుకుంటున్న ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళితో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎన్టీఆర్ ఫొటోలతో పాటు కొన్ని పోట్ల గిత్తల కొమ్ములకు వెంకటేశ్వర స్వామి ఫొటోలు కూడా తగిలించారు. కాగా ఈ జల్లికట్టు క్రీడను చూసేందుకు యువత భారీగా తరలి వచ్చింది. పోట్ల గిత్తల కొమ్ములు వంచటానికి కుర్రకారు చాలా హుషారు చూపింది. బ్రాహ్మణ పల్లి, నెమలి గుంటపల్లి, ఉప్పుల వంక, గంగిరెడ్డి పల్లి, యాపకుప్పం, చంద్రగిరి, చానంబట్ల, పాతచానంబట్ల, చవటగుంట తదితర గ్రామాల నుంచి జల్లికట్టును చూసేందుకు ప్రజలు తండోప తండాలుగా వచ్చారు. కాగా, జల్లికట్టు చాలా ప్రమాదకరమైన క్రీడ అంటూ దీనిపై కొంత కాలంగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: