అప్పుడెప్పుడో ‘మల్లీశ్వరి’లో మీర్జాపురం యువరాణిగా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న బాలీవుడ్ భామ కత్రినా కైఫ్.. ఆ తర్వాత హిందీలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కత్రినా కూడా ఒకరు. అలాంటి ఈ భామ మళ్లీ సౌత్ సినిమాల్లో నటిస్తుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఫిలిం వర్గాల నుంచి. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు, క‌త్రినా కైఫ్‌ ఈ సారి తమిళ చిత్రంలో నటించ బోతోందట. కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి హీరోగా నటించే సినిమాలో హీరోయిన్ గా కత్రినా కనిపించ బోతోందని సమాచారం. అది కూడా ఓ బాలీవుడ్ మూవీ రీమేక్ చిత్రమట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో సూప‌ర్ ‌హిట్ అయిన మూవీ `అందాధున్‌`. ఈ సినిమాలో హీరో ఓ అంధుడిగా కనిపిస్తాడు. హిందీలో యువ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసులు బాగానే కురిపించింది. దీన్ని తమిళంలో రీమేక్ చేయాలని  ద‌ర్శ‌కుడు శ్రీరామ్ రాఘ‌వ‌న్ భావిస్తున్నారు. ఈ సినిమాలోనే విజ‌య్‌ సేతుప‌తి హీరోగా నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులోనే క‌త్రినా కైఫ్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని కోలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో నిజానిజాలు ఎంతో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగ‌క త‌ప్ప‌దు.

ప్రస్తుతం బాలీవుడ్ లో తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్‌లో ఒక‌రైన‌ క‌త్రినా కైఫ్... కెరీర్ ప్రారంభంలో ద‌క్షిణాదిన నంద‌మూరి బాల‌కృష్ణ‌తో `అల్ల‌రి పిడుగు`, విక్ట‌రీ వెంక‌టేశ్‌తో `మ‌ల్లీశ్వ‌రి` చిత్రాల్లో నటించారు. అప్పట్లో ‘ప్రిన్సెస్ ఆఫ్ మీర్జాపురం’ గా ఈ అమ్మ‌డు భలే పాపులర్ అయ్యింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మ‌రో ద‌క్షిణాది స్టార్‌తో న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపించడం ఆసక్తిగా మారింది. ఈ విషయంపై డైరెక్టర్ గానీ, కత్రిన గానీ స్పందించే వరకూ అసలు విషయం తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: