ఈ మధ్య కాలంలో తరచూ విమర్శలతో వార్తల్లో మెరిసే కంగనా ఇప్పుడు సాహసం చేయబోతున్నట్టు సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. మరోసారి హిస్టారికల్ పాత్రలో కనువిందు చేయనుందట కంగనా. అందులోనూ స్వయానా తనే దర్శకత్వం వహించబోతుండడం విశేషం.ఘన విజయం సాధించిన మణికర్ణిక సీక్వెల్ రూపుదిద్దుకుంటోంది. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఝాన్సీరాణి లక్ష్మీభాయి పాత్రను కంగనా పోషించి ప్రేక్షకులను మెప్పించింది.
ఈ సినిమాతో తనలోని డైరెక్షన్ యాంగిల్ బయటపెట్టి డైరెక్టర్ క్రిష్ తో సంయుక్తంగా దర్శకత్వం వహించిన కంగనా... ఇప్పుడు ఈ సినిమాతో ఏక్ నిరంజన్ లా సోలోగా దర్శకత్వ బాధ్యతలను భుజాన వేసుకోనుందట. ఈ సీక్వెల్లో యోధురాలైన కాశ్మీరీ రాణి దిద్దా పాత్రలో కంగనా రనౌత్ కనిపించనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. ప్రస్తుతం తేజస్లో నటిస్తున్న కంగనా రనౌత్ అది పూర్తవగానే తన నెక్స్ట్ ప్రాజెక్టును మొదలు పెట్టనుందని సమాచారం. అంటే అటు ఇటు గా చూస్తే మణికర్ణిక సీక్వెల్ ప్రారంభమవడానికి ఇంకో ఏడాది పడుతుంది అంటున్నారు. మరి ఈ సినిమాతో పూర్తి దర్శకురాలిగా మారుతూ ... ఈ చిత్రంలో చాలెంజింగ్ రోల్ చేయబోతున్న కంగనా పెద్ద సాహసమే చేస్తోంది. మణికర్ణిక రిటర్న్స్ తెరకెక్కించనున్న ఈ బాలీవుడ్ భామకు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.