మాస్ మహరాజ్ రవితేజ, దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా క్రాక్ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి షో నుంచే ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇక క్రాక్ సినిమాతో పాటు ఈ సంక్రాంతికి ఇళయ దళపతి విజయ్ నటించిన మాస్టర్, చాక్లెట్ బాయ్ రామ్ నటించిన రెడ్ చిత్రాలు విడుదలయ్యాయి. మాస్టర్, రెడ్ చిత్రాలకు ఫ్లాప్ టాక్ రావడంతో సంక్రాంతి విన్నర్‌గా మాస్ మహరాజ్ నిలిచాడు. విడుదలైన ఐదు రోజుల్లోనే బయ్యర్లు ప్రాఫిట్‌లోకి వచ్చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇంతలా విజయమైన చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లోకి రీమేక్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. తెలుగులో హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రాలను బాలీవుడ్ నటులు రీమేక్ చేస్తుండటం సాధారణంగా జరుగుతూనే వస్తోంది.

అయితే ఈ సారి బాలీవుడ్ హీరోలు కాకుండా ఇప్పటి వరకు విలన్ క్యారెక్టర్స్ చేసిన సోనూ సూద్ ఈ చిత్రంలో హీరోగా నటించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రీమేక్ హక్కుల కోసం సోనూ సూద్ ఇప్పటికే క్రాక్ చిత్ర నిర్మాత ఠాగూర్ మధుతో సంప్రదింపులు కూడా జరిపారట. అంతేకాకుండా సోనూ సూద్ తన సొంత ప్రొడక్షన్‌లో ఈ క్రాక్ రీమేక్ చిత్రాన్ని బాలీవుడ్‌లో నిర్మిస్తారని అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. కరోనా లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ ఆపదలో ఉన్న వారిని ఏ విధంగా ఆదుకున్నారో చూశాం.

ఇప్పటికి సోషల్ మీడియా ఖాతాల ద్వారా అన్నా ఆపదలో ఉన్నాం ఆదుకోండి అని అడిగిన వారికి లేదు అని అనకుండా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన హీరోగా మారబోతున్నారన్న వార్త విని సోనూ సూద్ అభిమానులు ఎంతగానో ఆనందిస్తున్నారు. సోనూ సూద్ రియల్ హీరో అని.. ఇప్పుడు ఆయన రీల్ లైఫ్‌లోనూ హీరో అవతారం ఎత్తడం సంతోషించదగ్గ విషయమని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: