అటు బీజేపీ, శివసేన నేతలు కూడా భగ్గుమంటున్నారు. ఇప్పటికే ఈ వెబ్సిరీస్ డైరెక్టర్ అలీ అబ్బాస్పై ఈ సిరీస్ లో నటించిన మరికొంతమంది నటులపై కూడా లక్నోలో కేసు నమోదైంది. హిందూ మతాన్ని కించపరిచేలా ఉన్న ఈ వెబ్ సిరీస్ బ్యాన్ చేయాలంటూ అమెజాన్ ప్రైమ్కి నోటీసులు వెళ్లాయి. దీంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో తాండవ్ టీమ్ క్షమాపణలు చెప్పింది. ఏ మతం , కులం, సెంటిమెంట్లను కించపరిచే ఉద్దేశం తమకు లేదని చెప్పింది "తాండవ్" చిత్ర బృందం తెలిపింది. ఈ సిరీస్ ద్వారా ఎవరినైనా కించపరిచి ఉంటే క్షమించమని కోరింది.
ఇదిలా ఉండగా తాండవ్ వివాదంపై ఐ అండ్ బీ మినిస్టరీ దృష్టి సారించింది. ఈ వెబ్సిరీస్పై వెల్లువెత్తుతోన్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న మంత్రిత్వ శాఖ.. తాండవ్ టీమ్ను వెంటనే వివరణ ఇవ్వాలంటూ కోరింది. ఈ వెబ్ సిరీస్ పై బిజెపి నేతలు మొదటినుండి గుర్రుగానే ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ను వెంటనే అమెజాన్ ప్రైమ్ నుంచి తొలగించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే అమెజాన్ ప్రైమ్పై తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు.తాండవ్ వివాదంతో ఓటీటీని రెగ్యూలేట్ చేయాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. ఈ దిశగా ఐ అండ్ బీ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేపట్టింది. మరి ఓటీటీ ప్లాట్ ఫామ్ కు కూడా రాబోయే రోజుల్లో సెన్సార్ ఉంటుందేమో చూడాలి.