మహేశ్ కెమెరా ముందుకొచ్చి ఏడాది దాటింది. సంక్రాంతికి ముందు సరిలేరునీకెవ్వరు షూటింగ్లో పాల్గొన్నాడు. కరోనా సమయంలో ఇంటికే పరిమితమైపోయి... పిల్లలతో గడిపేశాడు. తోటి స్టార్స్ బిజీ అయినా.. మహేశ్ సినిమా సర్కారువారి పాట మాత్రం మొదలుకాలేదు. రామ్చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూట్లో ... ప్రభాస్ రాధేశ్యామ్తో ఉన్నారు. యాడ్స్ కోసం అడపాదడపా మేకప్ వేసుకుంటున్న మహేశ్.. సర్కారువారిపాట గెటప్లోకి ఎప్పుడు వస్తాడో మరి.
సర్కారు వారి పాట టీం అమెరికా వెళ్తున్నారు. కాదు కాదు.. హైదరాబాద్లోని బ్యాంక్ సెట్లో షూటింగ్ మొదలవుతుందన్న ప్రచారం జరుగుతుందేగానీ.. పాట స్టార్ట్ కావడంలేదు. షూటింగ్స్కు పర్మీషన్ ఇచ్చి 5 నెలలు అవుతున్నా.. నెలలు గడుస్తున్నా పాట మొదలుకాలేదు.
అమెరికాలో షూటింగ్ చేద్దామనుకుంటే.. వీసాలు రాలేదు. ఈ లోగా కరోనా స్టెయిన్ విజృంభించడంతో.. అక్కడికి వెళ్లలేదు. హైదరాబాద్లోనే భారీ షెడ్యూల్ ప్లాన్ చేసి ఆతర్వాతే అమెరికా వెళ్దామనుకున్నారు. ఎందుకు ఆలస్యమవుతుందోగానీ.. హైదరాబాద్ షెడ్యూల్ కూడా స్టార్ కాలేదు. ఈ లెక్కన షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కాబట్టి.. పూర్తయి.. రిలీజ్ కావడానికి ఇంకో ఏడాది ఆగాల్సిందేనేమో.
మొత్తానికి మహేశ్ బాబు షూటింగ్ లేక ఒంటరైపోయాడు. కరోనా తర్వాత స్టార్స్ అందరూ కెమెరా ముందుకు వచ్చేస్తే ఈయన మాత్రం సైలెంట్ గా ఉన్నారు. సర్కారు వారిపాట రెగ్యులర్ షూట్ మొదలు కాకపోవడంతో ఆయన అభిమానుల్లో గందరగోళం నెలకొంది.
మహేశ్ బాబు సినిమా షూట్ లో పాల్గొని ఏడాది దాటిపోయింది. అదిగో.. ఇదిగో అంటూ పాట మాత్రం ఊరించేస్తోంది. పరిస్థితులు చూస్తుంటే.. మహేశ్ బాబు మూవీ ఈ సంవత్సరం లేనట్టే అనే అనుమానం కలుగుతోంది.