తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో ఓ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు భానుచందర్. కె.విశ్వనాథ్ దగ్గర నుంచి ఎస్.ఎస్.రాజమౌళి వరకు రెండు తరాల దిగ్గజాలతో పనిచేసిన అనుభవం ఆయనది. తెలుగులో ఇప్పటికీ ఆయనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. 'మనవూరి పాండవులు' సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న భానుచందర్.. కెరీర్ ప్రారంభంలోనే ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజాలతో పనిచేశారు. 'సత్యం శివం' సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో కలిసి భానుచందర్ నటించారు. కెరీర్ ప్రారంభంలోనే దిగ్గజాలతో కలిసి నటించడం పట్ల ఇటీవల భానుచందర్ స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుచందర్ మాట్లాడుతూ..నేను ఎక్కడ కూర్చుంటే నువ్వూ అక్కడే కూర్చోవాలి..

నేను ఎక్కడ భోజనం చేస్తే నువ్వూ అక్కడే కూర్చొని భోజనం చేయాలి అని రామారావు గారు నాకు రూల్స్ పెట్టేవారు'' అని వెల్లడించారు. ''వైజాగ్‌లో హైకోర్టు సీన్ జరుగుతోంది. అక్కడ రెండు కుర్చీలు మాత్రమే ఉన్నాయి. రామారావు గారు ఒక కుర్చీలో కూర్చున్నారు.రాఘవేంద్రరావు గారు, నిర్మాత, మిగిలిన టెక్నీషియన్స్ అంతా నిలబడి ఉన్నారు. నాగేశ్వరరావు గారు వస్తే గుడ్ మార్నింగ్ బ్రదర్ అని ఆయన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. నేను చేతులు కట్టుకుని అక్కడే నిలబడ్డాను. నా వైపు చూసి ఏం బ్రదర్ టిఫిన్ చేశారా అని అడిగారు.నిలబడి ఉన్నారేంటి.. ఏయ్, నేను ఏం చెప్పాను.. బాబు నిలబడి ఉన్నాడు.. కుర్చీ ఏది అని కోపంగా అరిచారు.వెంటనే నాకు కుర్చీ వచ్చింది'' అని భానుచందర్ చెప్పుకొచ్చారు..

తనకు ఎన్టీఆర్ అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం తన తల్లి అని భానుచందర్ వెల్లడించారు. ''మా అమ్మని ఎన్టీఆర్ అక్కయ్య గారు అని పిలిచేవారు.మా అమ్మ ఆయన్ని అన్నయ్య గారు అనేవారు. ఒకరోజు తెల్లవారుజామునే మా ఇంటికి ఫోన్ వచ్చింది. అక్కయ్య గారు మాకు పచ్చ కామెర్లు వచ్చాయి.. మీరు మందు ఇస్తారని విన్నాను.మీ ఇంటికి ఎప్పుడు రావాలి అని అడిగారు. అన్నయ్య గారూ మీరు రావడమేంటి రేపు ఉదయాన్నే 4.30 గంటలకు నేనే తీసుకొస్తా అని చెప్పారు. నేను 4 గంటలకే సిద్ధంగా ఉంటానని ఆయన చెప్పారు. రెండు వేడి వేడి ఇడ్లీల్లో మందు కలిపి మా అమ్మ మూడు రోజులపాటు ఎన్టీఆర్‌కు ఇచ్చారు..తగ్గిపోయింది..ఆ తర్వాత కొద్ది రోజులుకి బాలకృష్ణ గారికి కూడా కామెర్లు అయితే.. ఆయనకు కూడా మా అమ్మే మందు ఇచ్చింది...'' అని భానుచందర్ చెప్పుకొచ్చారు...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: