సాయి పల్లవి:
ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అందరినీ "ఫిదా" చేసిన సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య సరసన "లవ్ స్టోరీ" సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కానుంది. అదేవిధంగా విప్లవం నిండిన వినూత్నమైన ప్రేమ కథ ద్వారా "విరాటపర్వం" లో రానాతో జత కట్టి ఇదే నెలలోనే ప్రేక్షకులను సందడి చేయనుంది.
కాజల్ అగర్వాల్:
ఈ మధ్య కాలంలో కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ చందమామ తాజాగా ఆమె నటిస్తున్న "ఆచార్య", "మోసగాళ్లు" చిత్రాలు ఈ వేసవిలో సందడి చేయనున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న "ఆచార్య" సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కాజల్ అగర్వాల్ సందడి చేయనున్నారు. అదే విధంగా మంచు విష్ణు హీరోగా నటిస్తున్న "మోసగాళ్లు" చిత్రంలో విష్ణుకు సోదరిగా కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది.
పూజా హెగ్డే:
పూజా హెగ్డే ప్రస్తుతం సినీ జీవితంలో ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు స్టార్ హీరోల సరసన చేస్తూ మరోవైపు కుర్ర హీరోలతో జతకట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం అక్కినేని అఖిల్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" లో నటించారు ఈ సినిమా జూన్ 19న విడుదల కానుంది. అదే విధంగా పాన్ ఇండియా హీరో అయినా ప్రభాస్ సరసన రాధాకృష్ణ దర్శకత్వంలో "రాధేశ్యామ్"చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చివరిదశ షూటింగ్ జరుపుకుంటుంది.
రీతూ వర్మ.. ఐశ్వర్య రాజేష్:
రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ ఇద్దరు ఈ వేసవిలో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నాని నటిస్తున్న "టక్ జగదీష్" చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఐశ్వర్య రాజేష్ సాయిధరమ్ తేజ్ హీరోగా "రిపబ్లిక్" సినిమాలో సందడి చేయనున్నారు. అదేవిధంగా రీతూవర్మ నాగసౌర్య హీరోగా తెరకెక్కుతున్న "వరుడు కావలెను" సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు జూన్ నెలలో విడుదల కానున్నట్లు తెలుస్తున్నాయి.