విశాల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా సినిమా చ‌క్ర‌. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలై మంచి విజ‌యాన్ని సాదించింది. ఈ చిత్రంలో విలన్‌ పాత్రలో న‌టించిన రెజీనాకు న‌ట‌న ప‌రంగా మంచి పేరు వ‌చ్చింది. నటిగా ఇలాంటి పాత్రలకు తాను కూడా సరిపోతానని భావించడం వల్లే ఈ అవకాశం వచ్చిందని రెజీనా అంటున్నారు.  ఒక నటిగా తనను తాను మెరుగుపరుచుకునేందుకు ఇలాంటి పాత్రలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపింది. విలన్‌గా తన పేరును ఎవరు సిఫార్సు చేశారో సరిగ్గా తెలియదుకానీ ద‌ర్శ‌కుడు ఆనందన్‌ ఈ చిత్ర కథను వివరించారని చెప్పింది. తమిళంలో ఇలాంటి పాత్రలు ఇప్పటివరకు చేయలేదని, తెలుగులో మాత్రం ‘ఎవరు’ అనే చిత్రంలో నటించినట్టు రెజీనా చెప్పింది. సమాజంలోని ప్రతి ఒక్కరూ వారివారి స్వలాభాల కోసం వెంపర్లాడుతుంటే తాను కూడా ఎందుకు అలా ఉండకూడదనే బలమైన ఆలోచన మనసులో నాటుకొనిపోయేలా ఉండే పాత్ర పోషించాన‌ని చెప్పింది.  ఇప్పుడు అదే పాత్ర‌కు ప్రేక్ష‌కుల నుంచి, విమ‌ర్శ‌కుల నుంచి అభినంద‌న‌లు వ‌స్తున్న‌ట్లు రెజీనా తెలిపింది.

ఈ చిత్రంలో త‌న పాత్ర‌కు డైలాగులు లేవంటున్నార‌ని, క‌ళ్ల‌తోనే హావ‌భావాలు ప‌లికించేలా ద‌ర్శ‌కుడు త‌న పాత్ర‌కు రూప‌క‌ల్ప‌న చేశార‌ని చెప్పింది. డైలాగులు కూడా ఈ పాత్ర‌కు త‌క్కువ రాశార‌ని చెప్పింది. విల‌న్ పాత్ర‌ల‌వ‌ల్ల భ‌విష్య‌త్తులో ఇలాంటి పాత్ర‌లే వ‌స్తాయంటున్నార‌ని, అలా మ‌న‌మెందుకు ఆలోచించాల‌ని రెజీనా అంటున్నారు. ఇలాంటి పాత్ర‌ల‌వ‌ల్ల మ‌న‌ల్ని మ‌నం నిరూపించుకునే అవ‌కాశాలు అరుదుగా వ‌స్తుంటాయ‌ని, అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు ఉప‌యోగించుకోవాల‌ని రెజీనా అంటోంది. డిజిట‌ల్‌ టెక్నాలజీతో మంచి, చెడు రెండూ సమపాళ్ళలో ఉన్నాయని,  క‌రోనా సమయంలో డిజిటల్‌ టెక్నాలజీపై ప్రజల్లో మంచి అవగాహన ఏర్పడిందని, సాంకేతిక‌పై ప్ర‌తి ఒక్క‌రూ అవ‌గాహ‌న పెంచుకోవ‌డం ఈరోజుల్లో అవ‌స‌ర‌మ‌ని రెజీనా అంటోంది. పోలీస్‌, లాయ‌ర్ త‌ర‌హా పాత్ర‌లు ఎప్పుడూ వ‌స్తూనే ఉంటాయ‌ని, ఇలాంటివి కాకుండా అరుదుగా వ‌చ్చే ప్ర‌తినాయిక ఛాయ‌లున్న పాత్ర‌ను స‌ద్వినియోగం చేసుకున్నాననే అనుకుంటున్న‌ట్లు రెజీనా క‌సాండ్రా చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: