బాలీవుడ్ కండలవీరుడు హృతిక్రోషన్, కంగనా రనౌత్ 2010లో కైట్స్ అనే సినిమాలో నటించారు. ఆ సినిమాకు హృతిక్ తండ్రి నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించారు. ఆ సినిమా సమయంలో హృతిక్, కంగనా ఇద్దరూ మంచి రిలేషన్షిప్లో కొనసాగారు. ఆ తర్వాత కూడా వారిద్దరూ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఏం జరిగిందో తెలియదుకానీ ఇద్దరూ విడిపోయారు. ఆ విడిపోవడం కూడా వివాదంగా మారింది. ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారు.
బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్, ఫైర్బ్రాండ్ కంగన రనౌత్ మధ్య ముగిసిపోయిందనుకున్న వివాదం మళ్లీ మొదలైంది. వారి ప్రేమ వివాదం కోర్టు మెట్లెక్కింది. కంగనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ హృతిక్ రోషన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మొదలైంది. ఆ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే 2016లో హృతిక్, కంగనా లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో వారిద్దరూ పంపుకొన్న ఈమెయిల్స్ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఆ కేసు విషయంలో ముంబై పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేయడానికి హృతిక్కు సమన్లు జారీ చేశారు.
తనను వేధిస్తున్నారని, వందలాది ఈమెయిల్స్ పంపుతున్నారని, వీటికి నకిలీ మెయిల ఐడీలు ఉపయోగిస్తున్నారంటూ హృతిక్ ఫిర్యాదులో ఆరోపణలు చేశారు. దీనికి కారణం కంగన రనౌత్ అని తెలిపారు. అయితే దీనికి కంగన స్పందిస్తూ ఇద్దరం
ప్రేమలో ఉన్న సమయంలో హృతిక్ తనకు ఆ మెయిల్ ఐడీ ఇచ్చారని, దాని ద్వారానే తాము మెయిల్స్ పంపుకొన్నామని కంగన సమాధానం ఇచ్చింది.
కంగనపై చేసిన ఫిర్యాదుకు సంబంధించి హృతిక్ రోషన్ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరవుతున్న నేపథ్యంలో బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. ప్రపంచమంతా మారిపోయి ముందుకు వెళుతోందికానీ నా మాజీ ప్రియుడు సిల్లీగా అక్కడే ఆగిపోయాడు. కాలం కూడా వెనక్కి వెళ్లలేదు. కానీ నా మాజీ ప్రియుడు వెనక్కి వెళ్లి వివాదాన్ని అదేపనిగా తిరగతోడుతున్నాడంటూ కంగన ట్వీట్ చేసింది.