బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’లో ఆమె వైష్ణవ్తేజ్ సరసన బేబమ్మగా నటించి ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టారు. మొదటి సినిమానే అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా ఆమె నటించిన విధానం చూసి సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, కృతి చిన్నతనంలోనే కెమెరా ముందు తళుక్కున మెరిశారు.
అయితే స్కూల్కు వెళ్లే వయసులో ఉన్నప్పుడే మొట్టమొదటిసారి ఓ దుస్తుల వాణిజ్య ప్రకటనలో కృతిశెట్టి పాల్గొన్నారు. అనంతరం ‘లైఫ్బాయ్’, ‘డైరీమిల్క్ చాక్లెట్’తోపాటు ఓ పెన్నుల కంపెనీ యాడ్లో కూడా ఆమె నటించారు. హృతిక్రోషన్ కథానాయకుడిగా 2019లో విడుదలైన ‘సూపర్ 30’లో సైతం కృతిశెట్టి ఓ సన్నివేశంలో కనిపించారు.
కృతిశెట్టికి ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. నాని సరసన ‘శ్యామ్సింగరాయ్’ చిత్రంలో ఓ నాయికగా నటిస్తున్న ఈ భామ, సుధీర్బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో రానున్న సినిమాలో కూడా కథానాయికగా ఖరారైంది. తాజాగా ఈ సుకుమారి తెలుగులో మరో బంపరాఫర్ను సొంతం చేసుకుంది. రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇందులో కృతిశెట్టిని కథానాయికగా ఎంపిక చేశారు. కేవలం ఒకే ఒక్క సినిమాతో వరుసగా మూడు భారీ చిత్రాల అవకాశాల్ని సొంతం చేసుకొని కృతిశెట్టి అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. యువతరంలో తెచ్చుకున్న ఫాలోయింగే వరుస ఆఫర్లకు కారణమని చెబుతున్నారు. తెలుగులో మరో బడా హీరోయిన్గా కృతిశెట్టి కెరీర్లో దూసుకుపోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మన బేబమ్మ నటించిన కొన్ని వాణిజ్య ప్రకటనలను మీరూ ఓసారి చూడండి.