ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. ఈ చిత్రాన్ని నారాయణదాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మించారు. ఏప్రిల్ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సుద్దాల అశోక్తేజ రచించిన ‘సారంగ దరియా’ అనే జాపనద గీతాన్ని ఆదివారం అగ్ర కథానాయిక సమంత విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే.
అయితే పవన్ సి.హెచ్ స్వరపరచిన ఈ పాటను మంగ్లీ ఆలపించింది. శేఖర్ మాస్టర్ నృత్యాల్ని సమకూర్చారు. ‘దాని కుడీ భుజం మీద కడవా, దాని గుత్తెపు రైకలు మెరియా, అది రమ్మంటె రాదుర సెలియా..దాని పేరే సారంగ దరియా’ అంటూ అచ్చ తెలంగాణ జానపద సాహిత్యంతో ఈ పాట ఆకట్టుకుంటోంది. సాయిపల్లవి నృత్యం ప్రత్యేకాకర్షణగా నిలుస్తోంది.
సారంగ దరియా పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. పాట చాలా క్యాచీగా ఉండటంతో, ట్యూన్ ఇంకా లిరికల్ వీడియోలో కనిపించిన స్టెప్స్ ప్రేక్షకులని ఆకర్షించాయి. అందుకే విడుదలైన కొంచంసేపటికే ఈ పాట ట్రెండింగ్ కి వచ్చేసింది. సారంగ దరియా పాట చూసిన తర్వాత ఈ పాటతో మళ్లీ యూట్యూబ్ రికార్డ్స్ బ్రేక్ అవ్వడం ఖాయం .
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘తెలంగాణ జానపద గీతం ‘సారంగ దరియా’కు సరికొత్త సొగసులు అద్ది తనదైన శైలిలో సుద్దాల అశోక్తేజ ఈ గీతాన్ని రచించారు. ఈ పాట అద్భుతంగా దృశ్యమానం కావడానికి కృషి చేసిన టీమ్ అందరికి ధన్యవాదాలు’ అని చెప్పారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విజయ్ సి కుమార్ చేస్తున్నారు. సంగీతం పవన్ సి హెచ్ అందిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఐర్ల నాగేశ్వరరావు, రచన-దర్శకత్వం శేఖర్ కమ్ముల వహిస్తున్నారు.