విలక్షణ నటుడు రాజశేఖర్ కూతుర్లు తెలుగు సినీ ఇండస్ట్రీ లో సెటిల్ అవ్వడానికి  ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. రాజశేఖర్ పెద్ద అమ్మాయి శివాని... మొదట ఓ సినిమా చేస్తుండగా కొన్ని కారణాల వలన అది మధ్యలోనే ఆగిపోయింది. దాంతో మరో సినిమాలో బిజీ అయిపోయారు ఆమె. ఇంతలోనే ఆయన రెండో కూతురు శివాత్మిక.. దొరసాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ  ఈ సినిమా పెద్దగా విజయాన్ని సాధించలేకపోయింది. కానీ హీరో హీరోయిన్లు ఇద్దరూ వారి నటనా ప్రతిభతో  విమర్శకుల మెప్పును మాత్రం పొందగలిగారు. అయితే ఇప్పుడు తెలుగులో పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో  తమిళంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రముఖ తమిళ హీరో కార్తిక్ తనయుడు గౌతమ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు శివాత్మిక. ఈ సినిమా పేరు ఆనందం విల‌యాడుమ్ వీడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు శివాత్మిక తండ్రి హీరో రాజశేఖర్. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సినీ ఇండస్ట్రీలో వారసుల పరంపర నడుస్తున్న విషయం తెలిసిందే. తెలుగు తమిళం హిందీ అని తేడా లేకుండా..ఇది ఎప్పటి నుండో వస్తున్న పాత సాంప్రదాయమే. అయితే స్టార్ నటీనటుల వారసులకు సినీ తెరంగ్రేటం సులభంగానే లభిస్తుంది కానీ దాన్ని వినియోగించుకొని సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అందులోనూ బాగా పరిశీలిస్తే హీరోహీరోయిన్ల వారసులకు ఇండస్ట్రీలో సక్సెస్ ఎక్కువగా లభిస్తోంది కానీ... వారి  వారసురాళ్లకు మాత్రం అంతగా లభించడం లేదనే చెప్పాలి.

కొందరు ఒకటి రెండు సినిమాలకే గుడ్ బాయ్ చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ మధ్యకాలంలో హీరోయిన్ రాధ కూతురు కార్తీక రంగం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమాతో మంచి సక్సెస్ ను కూడా అందుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ అవి తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్లడానికి పెద్దగా ఉపయోగపడలేదు. అదే తరహాలో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన నిహారిక సైతం కొన్ని సినిమాలకే పరిమితం అయ్యి పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. మళ్లీ హీరోయిన్ గా తిరిగి వస్తారా లేదా అన్నది తెలియదు. కానీ అందరి నటీనటుల వారసురాళ్లకు ఇదే పరిస్థితి అని చెప్పలేము కానీ ఎక్కువగా రాణించడం లేదని చెప్పొచ్చు. అయితే తన కూతుళ్లు ఇద్దరు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారని ఆకాంక్షిస్తున్నారు రాజశేఖర్.

మరింత సమాచారం తెలుసుకోండి: