టాలీవుడ్ లో విలన్స్ కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మన దగ్గర విలనిజం పండించడంలో దిట్ట అని చెప్పుకునే చాలామంది నటులు ఉన్నా సరే ఎప్పుడూ మన వాళ్ళు హిందీ విలన్స్ ని దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అలా దిగుమతి అయిన వారిలో బెంగాలీ నటుడు జిషూ సేన్ గుప్తా ఒకరు. గతంలో బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అందులో ఎల్.వి.ప్రసాద్ పాత్ర పోషించిన ఆయనకు ఆ తరువాతి కాలంలో నాగ శౌర్య నటించిన అశ్వద్ధామ అనే సినిమాలో మెయిన్ విలన్ రోల్ దక్కింది. 

ఆ సినిమాలో ఆయన విలనిజం నచ్చడంతో వెంటనే భీష్మ సినిమాలో కూడా నితిన్ కు విలన్ గా ఎంపిక చేశారు. మరి ఆయనలో అంత ఏమి నచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు తెలుగు నుంచి ఆయనకు వరుస సినిమా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే ఆయన ప్రతిష్ఠాత్మక మూవీగా తెరకెక్కుతున్న తలైవి అనే సినిమాలో శోభన్ బాబు పాత్రలో నటిస్తున్నారు. కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇక మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా ఆయన మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. 

తాజాగా నిన్న నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయ అనే సినిమాలో కూడా  జిషూ సేన్ గుప్తా విలన్ గా నటిస్తున్నాడు అంటూ ప్రకటన వచ్చింది. ఆయనలో మనవాళ్ళకు ఏమి నచ్చిందో తెలియదు కానీ ఈయనకు వరుస అవకాశాలు వచ్చి పడుతూ ఉండడం ఆసక్తికరంగా మారిపోయింది. నిజానికి తెలుగు సినిమాలు ఇప్పుడు దాదాపు అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త మార్కెట్ ఉన్న హీరోలతో సినిమాలు చేస్తుంటే నిర్మాతలు దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఆ కారణంగానే ఈయనను ఎక్కువ సినిమాలలో తీసుకుంటున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: