ఇంటర్నెట్ డెస్క్: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ హిమాలయాలకు వెళ్తారని తెలుసు. సినిమా పూర్తయినా, మనసు బాగాలేకున్నా రజినీ హిమాలయాలకు వెళ్లిపోతారు. ఒకానొక సమయంలో సినిమాలను, అన్నింటినీ వదిలేసి హిమాలయాల్లోనే స్థిరపడిపోదామని అనుకున్నట్లు వార్తలున్నాయి. అయితే మెగా బ్రదర్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.

అది కూడా ఏకంగా అక్కడే స్థిరంగా ఉండిపోవడానికి. ఈ విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించినా.. ఇది నిజం. తన స్నేహితుడితో కలిసి అక్కడకు వెళ్లిపోయి.. అక్కడే ఉండిపోదామని పవన్ అనుకున్నారట. దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. ఈ విషయాలను పవన్ స్నేహితుడు ఆనంద్‌సాయి తెలిపారు.

తెలుగుతో పాటు అనేక ఇతర భాషా చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా, యాదాద్రి ఆలయానికి శిల్పిగా, చినజియ్యర్ ఆశ్రమానికి నిర్మాణకర్తగా ఇలా ఎన్నో రకాలుగా ఎదిగిన వ్యక్తి ఆనంద్ సాయి. తెలుగు తెరపై తొలిసారిగా సముద్ర తీరంలో తాజ్‌మహల్‌ను సృష్టించిన కళాకారుడాయన. చెన్నైలో ఉన్నప్పుడు మెగా బ్రదర్ పవన్ కల్యాణ్‌తో ఆనంద్‌సాయికి మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరి ఆలోచనలూ బాగా కలిసేవి. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నారట.

‘పవన్ కల్యాణ్‌తో నా పరిచయం బ్రైటెన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అయింది. అప్పట్లో కోయంబత్తూరు నుంచి వచ్చే ఎర్కాడ్‌ ఎక్స్‌ప్రెస్‌ కోసం చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌లో ఉండేవాళ్లం. ఆ ట్రైన్‌లో సినిమా వాళ్లంతా చెన్నై వచ్చేవారు. అప్పుడు పవన్‌ వాళ్లన్నయ్య కోసం ఎదురుచూస్తూ ఉంటే నేను మా నాన్న కోసం వెయిట్‌ చేస్తూ ఉండేవాడిని. అక్కడ నుంచి మా స్నేహం ఇంకా బలపడింది.

నాకు బైక్‌ ఉండేది కానీ, పెట్రోల్‌కి డబ్బులుండేవి కావు. కల్యాణే పెట్రోల్‌ పోయించేవారు. అలా ఇద్దరం చెన్నై మొత్తం తిరిగేవాళ్లం. మా ఆలోచనలు బాగా కలిసేవి. ఒకప్పుడు నేనూ పవన్‌ కల్యాణ్‌ అలా అనుకున్నాం. దానికోసం పెద్ద ప్లాన్‌ కూడా చేసుకున్నాం, కానీ కుదరలేదు. మేము ఆ ఆలోచన చేసిన తరువాత పవన్‌కు సినిమా అవకాశం రావడంతో ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. నేనేమో చెన్నైలోనే ఉండిపోయా’ అంటూ ఆనంద్‌సాయి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: