ఇంటర్నెట్ డెస్క్: వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్‌లో విపరీతంగా వినపడుతోంది. ఈ పేరుకంటే ఆమె క్రాక్ సినిమాలో చేసిన పాత్ర జయమ్మగా ఆమె ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాతో ఆమె నటనకు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. దీంతో ఇప్పుడు ఆమె రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. క్రాక్ తర్వాత వచ్చిన 'నాంది' మూవీలో కూడా వరలక్ష్మి మంచి నటన కనబరిచింది. దీంతో ప్రేక్షకులు ఆమెను విపరీతంగా అభిమానిస్తున్నారు. ఇంకా మాట్లాడితే ఆమెకు ఓ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడిందని అనుకోవచ్చు. ఇప్పుడిదే ఊపులో ఆమెతో టాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు చేసేందుకు అనేకమంది నిర్మాతలు, దర్శకులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే అనేకమంది ప్రయత్నాలు కూడా మొదలుపెట్టేశారు.

            అందులో భాగంగానే.. ఆమె పుట్టినరోజు(మార్చి 5) సందర్భంగా.. ఆమె ప్రధాన పాత్రలో చేయబోతోన్న ఓ చిత్రాన్ని ప్రకటించారు. డార్లింగ్ స్వామి డైరెక్ష‌న్‌లో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో.. ఓ హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు రూపకల్పన చేయబోతున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి ప్రధాన పాత్రలో చేయబోతున్నారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ నాయిక‌గా.. హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కాంచ‌న కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. కోనేరు స‌త్యనారాయ‌ణ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రానికి డార్లింగ్ స్వామి ద‌ర్శ‌కత్వ బాధ్యతలు చేపట్టారు.
 
వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ బ‌ర్త్‌డే నేపథ్యంలో ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను కూడా అఫీషియల్‌గా విడుదల చేసింది. హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతున్న ఈ సినిమాలో ఓ కొత్త వర‌ల‌క్ష్మిని చూస్తారంటూ చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రానికి ముర‌ళీకృష్ణ కొడాలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా ఉండగా.. గాంధీ న‌డికుడిక‌ర్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌గా పని చేయబోతున్నట్లు సమాచారం. మరి తొలిసారిగా తెలుగులో కథానాయికా అడుగుపెడుతున్న వరలక్ష్మి ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: