అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కోహ్లీ డ్రెస్సింగ్ రూంలో నుంచి బాల్కనీలోకి పరిగెత్తుకుంటూ వచ్చి చప్పట్లు కొడుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఇంతకీ కోహ్లీకి అంత ఆనందం కలిగించిన విషయం ఏంటో తెలుసా..? టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీ. రిషబ్ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేయగానే కోహ్లీ ఆనందానికి అవధుల్లేవు. అప్పటివరకు సైలెంట్‌గా పాండ్యాతో ఏదో మాట్లాడుతూ కూర్చున్న కోహ్లీ.. రిషబ్ సెంచరీ పూర్తి చేయగానే.. ఒక్కసారిగా బయటకు పరుగుపరుగున వచ్చాడు. చప్పట్లు కొడుతూ, రిషబ్‌ను ప్రశంసించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇక ఆసీస్ సిరీస్‌నుంచి రిషబ్ సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. చాలా ఇన్నింగ్స్‌లలో 90ల వరకు వెళ్లినా.. అక్కడ అవుటైపోయేవాడు. అయితే ఈ సారి మాత్రం సెంచరీ మార్క్ దాటాడు. దీంతో రిషబ్‌తో పాటు భారత క్రికెట్ అభిమానులు కూడా తెగ సంబరపడిపోతున్నారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు రిషబ్ నుంచి సెంచరీ చూశామని ఆనందపడిపోతున్నారు. పంత్ కూడా తన సెంచరీతో చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు.

ఇదిలా ఉంటే అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. రెండో రోజు తొలి రెండు సెషన్లూ ఇంగ్లండ్ పైచేయి సాధించినా.. మూడో సెషన్‌లో మాత్రం అనూహ్యంగా టీమిండియా పోటీలోకొచ్చింది. రిషబ్ పంత్(101), వాషింగ్టన్ సుందర్(60 నాటౌట్)  ఏకంగా 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో భారత జట్టు పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఇక మరికొద్ది సేపటిలో మూడో సెషన్ ముగుస్తుందనగా.. రిషబ్ అవుటైనా ఆ తరువాత వచ్చిన అక్షర్ పటేల్(11)తో కలిసి సుందర్‌‌ మరో వికెట్ పడకుండా ఆచి తూచి ఆడాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: