ప్రస్తుతం కరోనా కేసులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. రోజురోజుకు రికార్డు బద్దలు కొడుతూ లక్షల సంఖ్యలో కేసులు నమోదు ఉండడం అటు సామాన్య ప్రజలతో పాటు అధికారులకు కూడా టెన్షన్ గా మారింది. గాలి నుంచి వైరస్ సంక్రమిస్తోందని అధికారులు భావిస్తూ ప్రజలను ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని కోరుతున్నారు. ఆ విషయం అలా ఉంచితే సామాన్య ప్రజలతో పాటు పెద్ద ఎత్తున సెలబ్రిటీలు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. నిర్మాత అల్లు అరవింద్, బండ్ల గణేష్, దర్శకుడు త్రివిక్రమ్, తాజాగా హీరో పవన్ కళ్యాణ్, సోనూ సూద్ లు కరోనా బారిన పడ్డారు. 

అయితే ఇప్పుడు మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. గత ఏడాది మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసి హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ లతో కలిసి ఎఫ్ త్రీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆ సినిమా షూటింగ్ ను ఆపేసినట్లు సమాచారం. 

సినిమా షూటింగ్ లో రోజువారీ టెస్టులు నిర్వహిస్తున్న సమయంలో ఆయనకు పాజిటివ్ అని తేలడంతో షూటింగ్ అప్పటికప్పుడు నిలిపి వేసినట్లు తెలుస్తోంది. అలాగే అనిల్ రావిపూడి ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు సమాచారం. నిజానికి ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ ఒకటి మైసూర్లో ప్లాన్ చేశారు. వెంకటేష్ దృశ్యం 2 షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించారు. ఇదే ఊపులో తమ సినిమా పూర్తి చేయొచ్చని భావించిన తరుణంలో అనిల్ రావిపూడి కి కరోనా సోకడంతో పూర్తిగా షూటింగ్ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: