ప్రముఖ బాలీవుడ్ యాక్టర్, ఫిల్మ్ మేకర్ అయిన అర్జున్ రాంపాల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. శనివారం రోజు సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వెల్లడించిన అర్జున్ రాంపాల్ తనని రీసెంట్ గా కలిసిన వారందరూ కూడా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.


అర్జున్ రాంపాల్ తన ట్విట్టర్ పోస్టులో.. "నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నాలో ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించక పోయినప్పటికీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. అలాగే అవసరమైన వైద్య సంరక్షణ పొందుతున్నాను. నాకు అవసరమైన అన్ని ప్రోటోకాల్‌లను నేను అనుసరిస్తున్నాను," అని పేర్కొన్నారు. 



తనకు కరోనా సోకిందని చెప్పడంతో పాటు తనతో ఇటీవల కాలంలో క్లోజ్ గా తిరిగిన వారందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలి అని ఆయన కోరారు. "గడిచిన 10 రోజుల సమయంలో నన్ను కలిసిన వారందరూ దయచేసి అప్రమత్తంగా ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. కొద్దిరోజుల పాటు తెలివిగా వ్యవహరిస్తూ జాగ్రత్తగా నడుచుకుంటే మనమందరం కూడా కరోనాను జయించవచ్చు! " అని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు.



కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో చాలామంది ప్రముఖ బాలీవుడ్ యాక్టర్లు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే సోనూ సూద్, మనీష్ మల్హోత్రా, కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్, నీల్ నితిన్ ముఖేష్, అలియా భట్, రణబీర్ కపూర్, పరేష్ రావల్, రోహిత్ సారాఫ్ తదితరులకు కొవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.



ఇకపోతే అర్జున్ రాంపాల్ "హరిహర వీరమల్లు" సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని తెలుస్తోంది. క్రిష్, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ పిరియాడికల్ డ్రామా లో అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్ర పోషించనున్నారని.. అతడి సోదరి మణి, రోషనారా బేగం గా జాక్వలిన్ ఫెర్నాండేజ్ నటించనున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: