నీ కాటుక కన్నులు విప్పారితే కష్టాలు తొలగుగాయి..
నీ లావణ్యమైన మనసు స్పందిస్తే చేతికి సాయమందుతుంది..
నీ మేని సౌందర్యంతో వెళ్లే దారిలో వెలుగులు పూయిస్తావు..
ఓ మగువా.. మగువా.. లోకానికి తెలుసు నీ మంచి మనసు విలువ..
ఈ చరణం అక్కినేని వారి కోడలు సమంతకు చక్కగా నప్పుతుంది. మానసిక సౌందర్యానికి శారీరక సౌందర్యం తోడైతే రూపుదిద్దుకున్న బాపుగారి బొమ్మే సమంత. సినిమాలు చేసినా చేయకపోయినా సమంత ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. కెరీర్ ప్రారంభం నుంచి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎంతోమందికి తోడ్పాటునందించిన సామ్ తాజాగా మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది. దీంతో నెటిజన్లు సమంతపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కవిత గురించి తెలుసుకున్న సామ్
అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డికి చెందిన కవిత అనే మహిళ గురించి సమంత తెలుసుకుంది. కవితకు ఆమె తల్లిదండ్రులు బాల్య వివాహం చేశారు. భర్త ప్రతి రోజూ తాగొచ్చి కొట్టడంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. కుటుంబానికి భారం కాకూడదని భావించి మొదట వ్యవసాయం చేసింది. ఏడుగురు తోబుట్టువులు, తల్లిదండ్రులు మొత్తం తొమ్మిదిమందినీ పోషించేది. తర్వాత ఆమె తల్లిదండ్రులు ఒకరి తర్వాత మరొకరు మరణించడం.. కుటుంబానికి పెద్దదిక్కు ఎవరూ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు.
స్విఫ్ట్ కారు కొనిచ్చిన సమంత
ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం కష్టమై, కుటుంబాన్ని నడపడానికి కవిత ఆటో నడపడం మొదలుపెట్టింది. మియాపూర్ నుంచి బాచూపల్లి వరకు ఆటోను తిప్పుతూ కుటుంబానికి అండగా నిలిచింది. ఓ కార్యక్రమంద్వారా కవిత గురించి తెలుసుకున్న సమంత.. ఆమెకు ఏదైనా సహాయం చేయాలని భావించింది. రూ.12.50 లక్షల ఖరీరైన స్విఫ్ట్ కారును కొని కవితకు అందజేసింది. దీంతో కవిత ఆనందానికి అవధుల్లేవు. సోషల్ మీడియాద్వారా ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి సమంతపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె అందమైన మనసును అందరూ మెచ్చుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే అందరికీ సాయమందించాలని కోరుతున్నారు.