కరోనా మహమ్మారి దెబ్బకు ఇండియాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వేరే చెప్పక్కర్లేదు. రోజురోజుకి లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రలలో ప్రభుత్వాలు కర్ఫ్యు - లాక్‌డౌన్‌లు విధిస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లలేక, ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేకమంది సెలబ్రిటీలు ప్రజల్లో కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలి..? దాని నుంచి ఎలా బయటపడాలి..? వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ముందుకెళుతున్నారు. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు, ప్రజలకు అనేక హెల్త్ టిప్స్ ఇస్తూ ధైర్య చెబుతున్నారు. అలాగే వ్యాక్సిన్ వేయించుకోవడంలో ఉండే అపోహలను తొలగిస్తూ.. అందరూ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే వేయించుకోవాలని సూచిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే అనేకమంది సెలబ్రిటీలు వ్యాక్సిన్ సొంతంగా వేయించుకుని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా చేరింది.

తాజాగా కాజల్.. భర్త గౌతమ్‌తో కలిసి కోవిడ్ ఫస్ట్ డోస్ వాక్సిన్ తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. వాక్సిన్ తీసుకున్న తరువాత ఫోటోలను పోస్ట్ చేసింది. వాక్సినేటెడ్ సక్సెస్ అంటూ ఆ ఫోటోలకు కాజల్ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోల్లో కాజల్ - గౌతమ్ ఇద్దరూ మాస్కులు ధరించి ఫోటోకు పోజిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోలను కాజల్ అభిమానులు తెగ షేర్ చేస్తూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇలా సెలబ్రిటీలు వ్యాక్సిన్‌ డోస్ వేయించుకోవడం వల్ల వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలు దూరమవుతాయని, మంచి పని చేశారని కాజల్ జంటను ప్రశంసిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తోంది. అలాగే దుల్కర్ సల్మాన్‌తో ‘హే సినామిక’ అనే సినిమాలో కనిపించనుంది. ఈ రెండు సినిమాలూ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. కరోనా పరిస్థితి తొలిగిపోతే కాజల్ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా.. ఇటీవల ఆమె నటించిన హారర్ వెబ్ సిరీస్ లైవ్ టెలికాస్ట్ ఓటీటీలో విడుదలై మంచి ఫలితాన్ని దక్కించుకుంది. ఈ సక్సెస్‌తోనే మరికొన్ని వెబ్ సిరీస్‌లు కూడా చేయాలని అనుకుంటోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: