నిజానికి వారం రోజుల క్రితమే ఈ వార్త బయటకు వచ్చినప్పటికీ శిల్పా శెట్టి స్పందించలేదు. అయితే తాజాగా ఆమె దీనిపై ఎట్టకేలకు బయటపడింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులు, ఫాలోవర్లతో పంచుకుంది. ‘నేను కరోనా బారిన పడ్డాను. నాతో పాటు భర్త రాజ్కుంద్రా, కుమార్తె శమిష, కుమారుడు వియాన్, తల్లి, అత్తమామలకు కరోనా సోకింది. గత 10 రోజులు ఎంతో కష్టంగా గడిచాయి. భగవంతుడి దయవల్ల ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు. అయితే నా రిపోర్టులు నెగటివ్ వచ్చాయి. కరోనా సోకిన కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వారివారి రూముల్లో ఐసోలేషన్లో ఉన్నారు. వైద్యుల సలహాలు పాటిస్తున్నాం. ఇంట్లో పనిచేసే ఇద్దరు సిబ్బంది కూడా వైరస్ బారినపడ్డారు. వారు కూడా చికిత్స కొనసాగుతోందం’టూ శిల్ప చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే కష్ట సమయంలో అండగా నిలిచి, తమ క్షేమం కోసం ప్రార్థించిన వారందరికీ శిల్పా శెట్టి కృతజ్ఞతలు తెలిపింది. కరోనా అనేది సామాన్యమైన విషయం కాదని, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని కోరారు. ప్రొటోకాల్ ప్రకారం భద్రతాపరమైన అన్ని సూత్రాలను పాటించామని, అందువల్లనే కోలుకోగలుగుతున్నామని చెప్పారు. ఇక తమకు కరోనా సోకగానే.. సత్వరం ప్రతిస్పందించి, సాయం అందించిన బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులకు కృతజ్ఞతలని తెలిపింది.