టాలీవుడ్ హీరోలు వరుసగా యంగ్ డైరెక్టర్లకు అవకాశాలిస్తున్నారు. రెండేళ్లలోనే అనేక మంది నూతన దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమే కాకుండా మంచి హిట్స్ కూడా ఖాతాలో వేసుకున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టడంతోనే హిట్స్‌ కొడుతూ సత్తా చాటుతున్నారు. దాంతో నెక్స్ట్ సినిమాకే స్టార్ హీరోలను లైన్‌లో పెట్టేస్తున్నారు. రాధేశ్యామ్ డైరెక్ట్ చేస్తున్న రాధాకృష్ణకుమార్.. జిల్ అనే ఒకే హిట్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ప్రజల నుంచి ఆ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో రెండో సినిమాకే ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఇదే తరహాలో డైరెక్టర్ సందీప్ వంగ కూడా అర్జున్ రెడ్డి అనే ఒకే ఒక్క సినిమాను తెరకెక్కించి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాగే ఇంకొంతమంది కుర్ర డైరెక్టర్లు కూడా స్టార్ హీరోలతో సినిమాలు పట్టేస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా చేరాడు. ఛలో సినిమాతో ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగు పెట్టిన వెంకీ డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అనంతరం నితిన్ హీరోగా గతేడాది భీష్మ సినిమా తెరకెక్కించి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి టాలీవుడ్‌లో సక్సెస్ డైరెక్టర్ అనే ట్యాగ్ సంపాదించుకున్నాడు. కానీ భీష్మ తరువాత ఏడాదిగా వెంకీ ఖాళీగా ఉన్నాడు. తన నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం వెంకీ.. మెగాహీరో వరుణ్ తేజ్‌కు ఓ కథ వినిపించాడని టాక్ నడుస్తోంది.

వెంకీ వినిపించిన కథ స్క్రిప్ట్ చదివిన వరుణ్ తేజ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు టాక్ నడుస్తుంది. మరి ఇండస్ట్రీలో నడుస్తున్న కథనాలను బట్టి డైరెక్టర్ వెంకీ కుడుముల - వరుణ్ తేజ్ కాంబినేషన్ రాబోతున్న సినిమా దసరా సమయంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. మరి ఈ విషయంపై ఇప్పటివరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేదు.
 
కాగా.. వరుణ్ తేజ్ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఎఫ్3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు బాక్సర్ పాత్రలో గనిలోనూ అలరించనున్నాడు. ఆ రెండు సినిమాల షూటింగ్ ఇప్పుడు కరోనా దెబ్బకు నిలిచిపోయింది. ఆ సినిమాలు పూర్తయిన తరువాత తదుపరి సినిమా ప్రకటించే అవకాశాలున్నట్లు సమచారం. అంటే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి విషయాలు తెలియాలంటే అప్పటివరకు ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: