నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలియని వారుండరు. తనదైన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసింది బ్యూటీ. అమ్మడు నటనతో పాటు డాన్స్ కూడా అదరగొడుతుంది. అంతేకాకుండా అమ్మడి డైలాగ్ డెలివరీతో కూడా అందరినీ ఆకట్టుకుంది. 2015లో వచ్చిన మలయాళం సినిమా మలార్‌తో వెండితెరకు పరిచయం అయింది. ఆ తరువాతి ఏడాదిలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో స్టార్ హీరోయిన్ హోదాను అందుకుంది. ఈ రెండు సినిమాలతో మలయాళంలో అగ్రహీరోయిన్‌ స్థాయికి చేరుకుంది.

 ఆ తర్వాత 2017లో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాయి పల్లవి తన తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆ తర్వాత అమ్మడు తెలుగులో వరుస సినిమా అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత ఏడాది 2018లో దియా సినిమాతో ముద్దుగుమ్మ తమిళంలోనూ అరంగేట్రం చేసింది. అయితే ప్రస్తుతం అమ్మడు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో ప్రస్తుతం అక్కినేని హీరో నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నారు.

 అంతేకాకుండా దగ్గుపాటి రానా సరసన విరాట పర్వం, నాచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తోంది. అయితే తాజాగా అమ్మడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా సిద్ధమయినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో బంపర్ హిట్ అందుకున్న ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయాలని శ్రీనివాస్ చూస్తున్నారు.

 ఈ సినిమా ద్వారా ఇప్పుడు నాచురల్ బ్యూటీ సాయి పల్లవి బాలీవుడ్ ఇంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు వీవీ వినాయక్ ఈ సినిమా హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారంట. కానీ అమ్మడు ఇంకా తన నిర్ణయం చెప్పలేదని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఈ సినిమాను సాయి పల్లవి ఓకే చేస్తే అమ్మడి బాలీవుడ్‌లో తొలి సినిమా అవుతుంది. మరి అమ్మడు ఈ సినిమాను ఓకే చేస్తుందేమో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: