దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతూనే ఉంది. ఈ వైరస్ రక్కసికి ప్రముఖ జర్నలిస్ట్ టీఎన్నార్ బలైన సంగతి అందరికి తెలిసిందే. ఆయన కొద్ది రోజుల క్రితం ఈ మహమ్మారి వైరస్ బారినపడ్డారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స‌ను తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సీనియర్ జర్నలిస్టు కమ్ ఆర్టిస్టు ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది. దీంతో సోమవారం ఉదయం వరకూ మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.

ఇక టీఎన్నార్ మరణంపై సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక, మంగళవారం మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలతో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు యాభై వేల రూపాయలను టీఎన్నార్ కుటుంబానికి ఆర్థిక సహాయంగా ప్రకటించారు. వీళ్లిద్దరే కాదు.. టాలీవుడ్‌కు చెందిన చాలా మంది ప్రముఖులు ఆయన ఫ్యామిలీకి అండగా నిలుస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఆర్థిక సహాయం ప్రకటించింది.

అయితే టాలీవుడ్‌లో పలు చిత్రాలు నిర్మించి మంచి పేరు సంపాదించుకున్న నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్.. తాజాగా టీఎన్నార్ కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో 'ప్రముఖు ఫిల్మ్ జర్నలిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్టు టీఎన్నార్ మరణం విచారకరం. మేము ఆయన కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించాం. ఆయన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ సానుభూతిని తెలుపుతున్నాం. ఓం శాంతి' అంటూ పేర్కొన్నారు. దీంతో ఈ సంస్థపై చాలా మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: