కీర్తి సురేష్ పేరు తెలియని వారుండరు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఇక అమ్మడి నటన గురించి మాటల్లో చెప్పలేం. మలయాళ సినీ పరిశ్రమలో బాల నటిగా ప్రారంభించిన తన కెరీర్‌ని అమ్మడు ఎంతో విజయవంతంగా కొనసాగిస్తోంది. అయితే 2016లో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సరసన ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన కీర్తి తన తొలి సినిమాతోనే కుర్రకారును కట్టిపడేసింది.

 ఆ తరువాత ఏడాది నాచురల్ స్టార్ నాని సరసన ‘నేను లోకల్’ సినిమాలోనూ అందరినీ మెప్పించింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో తెలుగులోనూ స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించింది. అంతేకాకుండా మహానటి అనిపించుకుంది. ఇటివల నితిన్ సరసన రంగ్‌దే సినిమాలోనూ నటించింది.

 అయితే ప్రస్తుతం అమ్మడు సూపర్ స్టార్ మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సినిమా గురించి మాట్లాడిన కీర్తి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలను కళ్లకు కట్టినట్లు ఈ సినిమా చూపించబోతున్నట్లు కీర్తి చెప్పింది.

 ‘ఈ సినిమా బ్యాంకు కుంభకోణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అని అందరికీ తెలుసు. ఇందులో బ్యాంకింగ్‌లో జరిగే మోసాలు, అవినీతి అంశాలు చూపించబోతున్నాం. అంతేకాకుండా వీటివల్ల సామాన్య ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని కూడా సినిమాలో చూపిస్తున్నా’మని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమాలో కీర్తి పాత్రపై అనేక వార్తలు వస్తున్నాయి. తాజాగా కీర్తీ సురేష్ ఈ సినిమాలో మహేష్‌కు సబార్డినేట్‌గా కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు సినీ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: