కేజీఎఫ్. బంగారం స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో తీసిన సినిమా. పుష్ప, ఎర్రబంగారంగా పిలుచుకునే ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో తీస్తున్న సినిమా. అక్కడ, ఇక్కడ రెండుచోట్లా సినిమా కాలంతోపాటు సాగదు, గతంలో జరిగిన కథలాగే కనపడుతుంది. హీరో లుక్ లో కూడా రెండు సినిమాల మధ్య పోలికలున్నాయి. కేజీఎఫ్ లో హీరో యశ్ సినిమా భారాన్నంతా తన భుజాన వేసుకుని నడిపిస్తే.. ఇక్కడ పుష్పలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. చివరికి పుష్ప సినిమా రెండు పార్ట్ లు గా రావడానికి కూడా కేజీఎఫ్ ఇన్స్ పి రేషన్ అని తేలుతోంది. అవును, కేజీఎఫ్ లాగే పుష్పని పార్ట్-1, పార్ట్-2 గా తీస్తున్న దర్శక నిర్మాతలు.. రెండు పార్ట్ ల కోసం భారీ బడ్జెట్ తో ప్రణాళిక వేసుకున్నారు.

కేజీఎఫ్, పుష్ప దాదాపుగా జిరాక్స్ కాపీల్లాగే కనిపిస్తాయి. సినిమాల నేపథ్యం, హీరో నెగెటివ్ క్యారెక్టర్, రగ్డ్ లుక్, అటు పోలీసులు, ఇటు మాఫియాతో హీరో తలపడే సందర్భం, సన్నివేశాలు, పాన్ ఇండియా కథలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో రెండు సినిమాలు జిరాక్స్ కాపీలే. చివరకిప్పుడు రెండు పార్ట్ లు గా సినిమాలు రావడం కూడా మరో సిమిలారిటీ. అయితే పుష్పని సరికొత్తగా ప్రజెంట్ చేస్తానంటున్నాడు దర్శకుడు సుకుమార్.

సుకుమార్ గత సినిమాలతో పోల్చితే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల నమ్ముతున్నాయి. ఇదే సమయంలో సినిమా మేకర్స్ సైతం సినిమాపై అంచనాలు పెంచేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. స్టార్ కాస్ట్ తో పాటు టెక్నికల్ క్రూ కూడా సినిమా పై రోజు రోజుకు అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. రష్మిక మందన్నా తొలిసారి అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అల వైకుంఠ పురములో సినిమాతో హిట్ కొట్టిన అల్లు అర్జున్, ఆ తర్వాత పుష్పకోసం బాగా గ్యాప్ తీసుకున్నారు. పాన్ ఇండియా మూవీతో రికార్డులు బద్దలు కొట్టే ఉద్దేశంతోటే అల్లు అర్జున్ గ్యాప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పుష్పతో కచ్చితంగా పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ కొడతానంటున్నాడు అల్లు అర్జున్. గతంలో బన్నీతో చేసిన ఆర్య, ఆర్య-2 కంటే పుష్ప మరింత పెద్ద హిట్ అవుతుందని సుకుమార్ కూడా ధీమాగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: