తమిళం స్టార్ విజయ సేతుపతి తెలియని వారుండరనడంలో అతిశయోక్తేమీ లేదు. తనదైన నటనతో అందరినీ మెప్పిస్తూ విలక్షణ నటుడనిపించుకున్నాడు. దానికి తోడుగా నటనకు ఆస్కారం ఉన్న కథలను ఓకే చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. హీరో, విలన్ అంటూ ఒకే పాత్రకు పరిమితం కాకుండా ప్రతి పాత్రలోనూ జీవిస్తాడు. అందుకనే ఇప్పుడు అతడంటే తమిళ, తెలుగు దర్శక నిర్మాతలు అతడి కోసం క్యూ కడుతున్నారు. పిజ్జా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి తన తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

అయితే తాజాగా తెలుగులో సంచలనాలు సృష్టించిన ‘ఉప్పెన’ సినిమాలోనూ బేబమ్మ తండ్రి పాత్రలో విజయ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో విజయ్ పండించిన విలనిజానికి అభిమానులు ఫిదా అయిపోయారు.  ఈ సినిమా విజయ ప్రకంపనలు దేశమంతటా ప్రభావం చూపాయి. అన్నింటికన్నా ఈ సినిమాలో విజయ్ నటనకు భారీ గుర్తింపు అందింది. వీటితో పాటుగా భారీ అంచనాలతో వచ్చి అంతకుమించిన హిట్ సాధించిన ‘మాస్టర్‌’ సినిమాతో విజయ్ సేతుపతి జాతీయ స్థాయి నటుడిగా మారాడు.

ప్రస్తుతం విజయ్ సేతుపతి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తమిళం, తెలుగు, మలయాళం భాషలతో పాటు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. అయితే తాజాగా విజయ్ చేయనున్న తర్వాతి సినిమా గురించి ఓ వార్త సినీ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. విజయ్ తన తర్వాతి సినిమాను శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాకు ‘మెర్రీ క్రిస్మస్’ అన్న టైటిల్ కూడా ఖరారైంది. ఈ సినిమా విజయ్ చేస్తున్న రెండో బాలీవుడ్ సినిమా.

 అయితే దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కారణంగా ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ సినిమాను లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే ప్రారంభం చేస్తామని, ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేమని మూవీ మేకర్స్ అన్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన వెంటనే శరవేగంగా మూవీని కంప్లీట్ చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా చిత్రీకరణ ఏప్రిల్‌లో ముంబైలో జరగాల్సి ఉంది. కానీ ముంబైలోని విపత్కర పరిస్థితుల కారణంగా ప్రారంభం కాలేదు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: