మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చి త‌న‌దైన శైలిలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్న అల్లు అర్జున్ గ‌త చిత్రం అల వైకుంఠ‌పురం. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లై ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ త‌రువాత స్టైలిష్ స్టార్ న‌టిస్తున్న చిత్రం పుష్ప‌. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల వెలువ‌డుతున్న కొన్ని వార్త‌లు దీనిపై ఆస‌క్తిని మ‌రింత పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్ర‌బృందం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా మొదటి భాగాన్ని అక్టోబర్ 13 న విడుదల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం మొదటి భాగం పూర్తి చేయడానికి ఇంకా 20 రోజుల షూటింగ్ వ‌ర్క్ బ్యాలెన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. మొదటి భాగం ఫహద్ ఫాజిల్ కనిపించడంతో ముగుస్తుందట. గ‌తంలో ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి రూపొందించిన‌ బాహుబలి మాదిరిగానే.. సుకుమార్ కూడా త‌న సినిమా ఫ‌స్ట్ పార్ట్‌ను సస్పెన్స్ తో ముగించాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు ఈ విష‌యంపై చిత్ర‌బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

అయితే ఈ చిత్రానికి సంబంధించి వ‌స్తున్న వార్త‌ల‌పై ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్పటి వరకు తెలుగులో రెండు భాగాలుగా విడుద‌లైన చిత్రాలు రెండు మాత్ర‌మే. ఒక‌టి బాహుబ‌లి కాగా రెండోది.. బాల‌కృష్ణ హీరోగా ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కించిన ఎన్టీఆర్ బ‌యోపిక్‌. ఇది క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు అనే రెండు భాగాలుగా ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చింది.  బాహుబ‌లిగా  న‌టించిన ప్ర‌భాస్ ఆ చిత్రాల అద్భుత విజ‌యంతో పాన్ ఇండియా హీరోగా మారిపోగా.. బాల‌య్య  ఖాతాలో మాత్రం రెండు డిజాస్టర్లు మిగిలాయి. బాహుబ‌లి చిత్రానికి సంబంధించి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అనుస‌రించిన ప్ర‌చార వ్యూహం, క‌ట్ట‌ప్ప‌.. బాహుబలిని ఎందుకు చంపాడు..? అంటూ ప్రేక్ష‌కుల్లో రేకెత్తించిన‌ సస్పెన్స్ ఆ చిత్రాల విజ‌యానికి ప్ర‌ధాన కార‌ణం. మ‌రోప‌క్క ఎన్టీఆర్ కథానాయకుడు ప్ర‌జాద‌ర‌ణ పొంద‌డంలో విఫ‌ల‌మ‌య్యాక‌, అటు ట్రేడ్ వ‌ర్గాలు గానీ ఇటు ప్రేక్షకులు గానీ ఎన్టీఆర్ మహానాయకుడు పై ఆసక్తి చూపలేద‌న్న విష‌యాన్ని ఇక్క‌డ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాలి. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న‌ పుష్ప చిత్రానికి సంబంధించి కూడా రెండు భాగాలుగా విడుద‌ల చేయాల‌న్న ప్ర‌య‌త్నానికి ముందు ఈ ప్ర‌మాదాన్ని త‌ప్ప‌క దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంది. మొదటి భాగం కనుక ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైతే అసలుకే మోసం జరగొచ్చు. అయితే రంగ‌స్థ‌లం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా త‌రువాత ద‌ర్శ‌కుడు సుకుమార్ నుంచి వ‌స్తున్న ఈ చిత్రానికి సంబంధించి అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకునే ఉంటార‌ని, ఇది బాహుబ‌లి లాంటి విజ‌యం అందుకోవ‌డం ఖాయ‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: